అమరావతి డిజైన్లకు మరో 2 కమిటీలు, 'కాపులకు రాజకీయ ప్రాధాన్యత'
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర డిజైన్ల కోసం మరో రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ బుధవారం వెల్లడించారు.
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర డిజైన్ల కోసం మరో రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ బుధవారం వెల్లడించారు.
డిజైన్లపై మరింతగా చర్చించి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. మంత్రులలతో ఒక కమిటీ, ప్రిన్సిపల్ సెక్రటరీలతో మరో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కమిటీ సూచనలను కేబినెట్లో పెట్టి వారి సలహాలు తీసుకొని డిజైన్లను ఖరారు చేస్తామని తెలిపారు. మే నెల 2, 3, 4 తేదీల్లో లండన్లో పర్యటించనున్నట్టు చెప్పారు. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో సమావేశమవుతామన్నారు.
కాపులకు ఎంతో ప్రాధాన్యత: రామానుజయ
కాపులకు ఏ ప్రభుత్వంలోనూ దక్కనంత ప్రాధాన్యత ప్రస్తుతం దక్కుతోందని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ రామానుజయ అన్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు.
రాజకీయంగానూ గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత దక్కుతోందని తెలిపారు. కాపు కార్పోరేషన్ ద్వారా ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి ఆర్థిక సాయం అందించామన్నారు.
సూక్ష్మ పరిశ్రమల పథకం కింద అయిదు వేలమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామని, ఈ యూనిట్ల ద్వారా 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
కాపు మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఏపీ వ్యాప్తంగా ఇరవై అయిదు వేల మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలో కాపు కార్పోరేషన్ భవన్ పూర్తి చేస్తామన్నారు.