టీడీపీలోకి మరో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే- ఈనెల 26న ముహుర్తం ఖరారు ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజాప్రతినిధులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇన్నాళ్లూ తాము సేవ చేసిన పార్టీలు తమను పట్టించుకోకపోవడంతో అలిగి ఇతర పార్టీలకు జంప్ అయ్యేందుకు సిద్దమైపోతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పేయగా.. తాజాగా ఇదే వరుసలో మరో ఎమ్మెల్యే చేరిపోతున్నారు. టీడీపీలో ఆయన చేరికకు రంగం సిద్ధమైంది.
వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో తిరువూరు సీనియర్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కూడా సీటు కోల్పోయారు. ఆయన స్ధానంలో టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని వెంట వచ్చిన నల్లగట్ల స్వామిద్వాస్ ను జగన్ ఇన్ ఛార్జ్ గా నియమించారు. దీంతో రక్షణనిధి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపారు. ఇవి ఫలించడంతో పార్టీ మారేందుకు ఆయన సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 26న తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీలో తిరువూరు టికెట్ విషయంలో సందిగ్ధం నెలకొంది. కొలికపూడి శ్రీనివాస్, దేవదత్ తో పాటు పలువురు ఈ రేసులో కూడా ఉన్నారు. అయితే వీరందిరినీ కాదని రక్షణనిధికి టికెట్ కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26న చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్దం పుచ్చుకుని, అనంతరం ఈ నెల 28న రక్షణనిధి తిరువూరు వస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications