అనూహ్య కేసు: అంతకుమించి సంబంధంలేదన్న ఫ్రెండ్
విజయవాడ/ముంబై: అనూహ్య తనకు మంచి స్నేహితురాలని, ఆమె హత్యతో తనకేం సంబంధం లేదని హేమంత్ చెబుతున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో దారుణ హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంకు చెందిన మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో పోలీసులు హేమంత్ అనే యువకుడిని అనుమానిస్తున్నారు.
దీనిపై ఆయన ఓ ఛానల్తో సోమవారం మాట్లాడారు. అనూహ్య తనకు మంచి స్నేహితురాలని చెప్పారు. ఆమె ముంబై వెళ్తుండగా సికింద్రాబాదు రైల్వే స్టేషన్కు వచ్చాక ఆమెకు లంచ్ బాక్స్ ఇచ్చానని చెప్పారు. ఆ తర్వాత తాను షిరిడీకి వెళ్లానని తెలిపారు. తాను మధ్యాహ్నం కలిసి ఫుడ్ ప్యాక్ ఇచ్చాక ఆ తర్వాత ఒకసారి మాత్రం ఫోన్ చేసి మాట్లాడానని తెలిపారు.
తాను అనూహ్య వెళ్లిన రైలులోనే మరో బోగీలో వెళ్లినట్లు చెబుతున్నారని, అది వాస్తవం కాదన్నారు. తాను ఆ తర్వాత షిరిడీకి వెళ్లానని, కావాలంటే అక్కడి గుడికి వెళ్లి సిసిటివి పుటేజ్ చూసుకోవచ్చునని తెలిపారు. ఆమెను కేవలం సికింద్రాబాదు స్టేషన్లో మాత్రమే కలిశానని అన్నారు.
తనను ఎందుకు అనుమానిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముంబైలో ఫ్రెండ్స్ ఉన్నట్లు తెలుసు కాని, ఎవరో తెలియదన్నారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకుమించి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఐదో తారీఖున అనూహ్య కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆందోళన చెందితే ఆమె ఏ కంపార్టుమెంటులో వెళ్లారో తానే చెప్పానని అన్నారు.