మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ట్విస్ట్: 21 బ్యాంక్ ఖాతాలపై ఆరా
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్య కేసు దర్యాప్తులో భాగంగా వెలుగు చూసిన అనధికార బ్యాంకు లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆ విషయమే చెప్పారు.
అనురాధ దంపతుల హత్య జరిగిన మరుక్షణం నుంచి అనూహ్యమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. కేసులోని నిందితులకు ప్రముఖులతో ఆర్థిక, వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అవి చట్టపరిధిలో జరిగాయా, అనధికారికంగా జరిగాయా అనే విషయాన్ని తేల్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
మేయర్ దంపతుల హత్య కేసులోని నిందితులకు, వారి సన్నిహితులకు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వాటిలో చింటూ పేర మీద మూడు వ్యక్తిగత ఖాతాలు, మురుగా పేరు మీద నాలుగు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు సమాచారం.
ఈ ఖాతాల్లోకి పెద్ద యెత్తున్న అమెరికా నుంచి నగదు చేరినట్లు తెలుస్తోంది. నగదు పంపినవారికి కుట్రలో పాత్ర ఉందా, నగుదు ఎందుకు వచ్చింది అనే అంశాలను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేసే బాధ్యతను డిఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు.
అనధికారికంగా జరిగిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఐటి శాఖకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఇవ్వాలని పోలీసులు అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారాల్లో ఎవరి పేర్లు ముందుకు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది.