త్వరలో గవర్నర్తో జగన్ భేటీ?- ఫిబ్రవరి చివరి వారంలోగా..!!
అమరావతి: ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదే రకమైన సంకేతాలను పంపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంచనా వేశారు. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత వైఎస్ జగన్- ముందస్తుకు వెళ్లొచ్చనీ జోస్యం చెప్పారు.

అసెంబ్లీ బడ్జెట్ భేటీ..
ఈ పరిణామాల మధ్య- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి చివరి వారంలో వైఎస్ జగన్- అసెంబ్లీని సమావేశపర్చుతారని తెలుస్తోంది. కనీసం 20 నుంచి 25 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు కూడా ఉంటుందని తెలుస్తోంది.

త్వరలో మంత్రివర్గం..
సమావేశాల ఆరంభానికి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమౌతుంది. సభలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులపై చర్చిస్తుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదిస్తుంది. కొన్ని కీలక తీర్మానాలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. శాసన మండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేయాల్సిన ప్రసంగ పాఠాన్ని మంత్రివర్గం ఆమోదిస్తుంది.

వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు..
వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. వార్షిక బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం 2.50 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ధారించే అవకాశం ఉందని సమాచారం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన.. వంటి పథకాలను అమలు చేస్తోన్నందున విద్యారంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.

ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు..
అన్నింటికి మించి- మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. దీనికి అసవరమైన ప్రక్రియను అధికారులు ఇదివరకే చేపట్టారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ బిల్లు సభామోదం పొందితే.. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వైఎస్ జగన్ పరిపాలనను సాగించడం లాంఛనప్రాయమే అవుతుంది.

31న సుప్రీంలో విచారణ..
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియ మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 31వ తేదీన మరోసారి ఈ పిటీషన్లు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నాయి. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని నిర్ధారించడానికి కోర్టులు- టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావంటూ ఇదివరకు న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

త్వరలో గవర్నర్ తో భేటీ..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో- వైఎస్ జగన్ త్వరలోనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలుసుకునే అవకాశం ఉంది. శాసన మండలి, శాసనసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించాల్సిన ఉన్న నేపథ్యంలో- మర్యాదపూరకంగా గవర్నర్ ను కలుసుకుంటారు జగన్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని ఆహ్వానిస్తారని చెబుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గవర్నర్ కార్యాలయం ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తుందని సమాచారం.












Click it and Unblock the Notifications