ప్రభుత్వ ఉద్యోగులూ..ఎన్నికల విధుల్లో జాగ్రత్త, ఆ పని అస్సలు చెయ్యొద్దు!
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 4 నుంచి 9వ తేదీ వరకు 6 రోజుల పాటు జరిగిన ఓటింగ్లో 4,44,216 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన పోస్టల్ బ్యాలెట్లను ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు అంతరంగం ఎలా ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు మాత్రం ఉద్యోగుల మద్దతు తమకంటే తమకంటూ ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో వారిని కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రమే చూడలేమని, ఎన్నికల విధుల్లో కీలకపాత్ర పోషించడం వల్ల ఓటర్లను ప్రభావితం చేయగలిగే వారిగా కూడా చూడాల్సిన అవసరం ఉందనే వాదన తెరమీదకు వచ్చింది. అయితే, ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములుగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులు.. ఎన్నికల్లో పక్షపాతంగా వ్యవహరిస్తూ.. అలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడే అవకాశం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

కరోనా కష్టకాలంలో...
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు ఉన్నారనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజు మాత్రమే తేలాల్సి ఉంది. కానీ, తమ కర్తవ్యాన్ని విస్మరించి ప్రభుత్వ ఉద్యోగులు అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పని చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు చేజేతులా తమ గోతిని తామే తవ్వుకున్నట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, తమ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ.. వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేయాల్సిన అవసరం వారికి లేదని స్పష్టం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో గుజరాత్లో 20 శాతం, తెలంగాణలో 10 శాతం ఇలా చాలా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయని,ఒక్క ఏపీలోని వైసీపీ ప్రభుత్వమే ఉద్యోగులకు పూర్తి జీతాన్ని అందించిందని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల విధులను విస్మరిస్తే.. తీవ్ర పరిణామాలు
ఏదిఏమైనా.. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఓ గౌరవప్రదమైన స్థానం ఉంది. అలాంటి ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే ప్రతి ఒక్కరూ నిజాయితీగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటప్పుడే ఎన్నికల వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగిపైనా ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఉద్యోగుల సమస్యలు.. వాటికి పరిష్కారాలు అనేవి విభాగాలవారీగా వారి వ్యక్తిగతం కిందకు వస్తాయి. నిజంగా ప్రభుత్వంపైన వ్యతిరేక భావన ఉన్నప్పుడు సామాన్య పౌరునిలానే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. అంతేకాని, తమ ఎన్నికల విధులను విస్మరించి ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానో.. లేక అనుకూలంగానో ఓటర్లు ప్రభావితం చేసేలా వ్యవహరించే ప్రయత్నం చేస్తే మాత్రం.. అది ముమ్మాటికీ నేరంగానే పరిగణించబడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరోక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications