రాజధాని అమరావతి ఓటర్ల మనోగతం ఇదే: తాజా సర్వేలో ఆసక్తికర ఫలితాలు
Andhra Assembly elections 2024: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగుస్తుంది.
అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకంటే ముందు రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు.

ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న ఈ పరిస్థితుల్లో ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థా దాస్.. తన తాజా నివేదికను వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ ఇది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు లోక్సభ పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల.. నరసరావుపేట లోక్సభ పరిధిలో కొనసాగుతున్నాయి. వేమూరు, రేపల్లె, బాపట్ల స్థానాలు బాపట్ల పరిధిలోకి వస్తాయి. గతంలో ఇవన్నీ గుంటూరు జిల్లాలోనివే.
ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం కూటమి పార్టీ పోటాపోటీగా సీట్లను గెలుచుకుంటాయని పార్థా దాస్ సర్వే అంచనా వేసింది. 9 నుంచి 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తుంది. మిగిలిన 7 నుంచి 8 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది.

ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ, టీడీపీకి సమానంగా ఓట్ల శాతం పోల్ అవుతుంది. ఈ రెండు పార్టీలకు కూడా 49.9 శాతం మేర ఓట్లు పడతాయని సర్వే అంచనా వేసింది. వైసీపీకి ఓటు వేసే పురుష ఓటర్లు 47.4 శాతం మంది ఉన్నారు. 52.2 శాతం మంది కూటమి వైపు మొగ్గు చూపారు.
మహిళా ఓట్లు మాత్రం గుత్తగా వైఎస్ఆర్సీపీకే పోల్ అవుతాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే- 57.2 శాతం మంది మహిళలు అధికార పార్టీకి ఓటు వేస్తారు. 42.5 శాతం మహిళలు టీడీపీకి ఓటు వేస్తారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి 37.2 శాతం మంది జైకొట్టారు. రాహుల్ గాంధీ వైపు 37.0 శాత మంది మొగ్గు చూపారు. 25.7 శాతం మంది తటస్థంగా వ్యవహరించినట్లు పార్థా దాస్ సర్వే వెల్లడించింది.












Click it and Unblock the Notifications