రాజధాని బిల్లుల విషయంలో కొత్త ట్విస్ట్: అటు కేంద్రం ఇటు హైకోర్టు, ఆయన కొనసాగాల్సిందే..!
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు విశాఖ నుంచి పాలన కొనసాగించాలని నిర్ణయానికి బ్రేకులు పడుతున్న వేళ ఈ నిర్ణయం కీలకంగా మారింది. ఏపీలో మూడు రాజధానులు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు శాసనమండలిలో ఆమోదం పొందలేదు . ఛైర్మెన్ విచక్షణాధికారంతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాల్లో అసెంబ్లీ కార్యదర్శి పాత్ర కీలకంగా మారింది.
ఛైర్మెన్ ఆదేశాలు సైతం అమలు కాలేదు. ప్రభుత్వ వాదనకే శాసనసభ కార్యదర్శి మద్దతు ప్రకటించారు. ఈ బిల్లుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. తమకు మద్దతుగా నిలిచిన శాసనసబ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. ఏకంగా ఆయన సర్వీసును పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగానే కాకుండా అధికార వర్గాల్లోనూ హాట్టాపిక్గా మారింది.
అసెంబ్లీ కార్యదర్శికి ప్రభుత్వం బంపరాఫర్
ఏపీ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యుల సర్వీసు ఈ రోజుతో ముగిసింది. ఆయన పదవీవిరమణ చేయాల్సి ఉంది. ఇంతలో ప్రభుత్వం నుంచి ఊహించని విధంగా బంపరాఫర్ వచ్చింది. ఏడాది కాలం పాటు ఆయన సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి నుండి పాలనా వ్యవహారాలను విశాఖకు తరలించాలని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. దానికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభలో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. శాసనమండలిలో ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ఎదురైంది.
బాలకృష్ణమాచార్యుల సేవలు అవసరమని భావించిన ప్రభుత్వం
ప్రతిపక్షాల డిమాండ్ మేరకు మండలి ఛైర్మెన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం వివాదం హైకోర్టుకు చేరింది. శాసనపరిధిలో బిల్లుల వ్యవహారం తేలేవరకు రాజధాని తరలింపుపై ముందుకు వెళ్లకూడదని హైకోర్టు నిర్దేశించింది. దీంతో ఇప్పుడు తిరిగి ఆ రెండు బిల్లుల చుట్టే రాజధాని తరలింపు వ్యవహారం తిరుగుతోంది. ఈ సమయంలో కొత్త వారిని కాకుండా ప్రస్తుతం ఉన్న బాలకృష్ణమాచార్యులని అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Recommended Video
ప్రభుత్వానికి మద్దతుగా నిలబడటంతో...
కీలకమైన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మెన్ ఆదేశించినా ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. సెలెక్ట్ కమిటీలో సభ్యుల నియామకం కోసం ప్రాతినిథ్య పార్టీలకు లేఖలు రాయాలని ఛైర్మెన్ ఆదేశించారు. అయినా అడుగు ముందుకు పడలేదు. ఛైర్మెన్ విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకున్నామని చెప్పినా ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. ఏకంగా మండలినే రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ వాదనకు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు మద్దతుగా నిలిచారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపాలని ఛైర్మెన్ ఆదేశాలను అమలు చేయలేమంటూ పక్కనబెట్టారు. రెండో సారి ఛైర్మెన్ నుంచి లేఖ వచ్చినా సెలెక్ట్ కమిటీకి పంపండం నిబంధనలకు వ్యతిరేకమని బాలకృష్ణమాచార్యులు తేల్చి చెప్పారు.