పంతం నెరవేర్చుకున్న చంద్రబాబు
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రుల ప్రమాణ స్వీకారం, శాఖల కేటాయింపు చకచకా పూర్తయ్యాయి. చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. పాలనను పరుగులెత్తించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అయిదు గ్యారంటీలపై సంతకాలూ చేశారు.
ఇక ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 19వ తేదీన అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్గా పొన్నూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతకంటే ఒకరోజు ముందు అంటే- 18వ తేదీన మంత్రివర్గం సమావేశమౌతుంది. చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో ఈ భేటీ ఉంటుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ఆరంభమౌతుంది. దీనికి అవసరమైన అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్.. అన్ని శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలకు నేడు పంపించనున్నారు. అజెండాకు అనుగుణంగా పూర్తిస్థాయి సమాచారాన్ని అధికారులు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.
అసెంబ్లీలో ఆమోదించాల్సిన పెండింగ్ బిల్లులు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు.. వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. పోలవరం సహా గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయటంపైనా మంత్రులు చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం గురించి మంత్రివర్గంలో ప్రత్యేకంగా చర్చిస్తారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై నమోదైన కేసులను ఉపసంహరణ, కొన్ని శాఖలు చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న అక్రమాలపై మంత్రివర్గం ఆరా తీస్తుందని అంటున్నారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సుదీర్ఘకాలం పాటు అసెంబ్లీలో అడుగు పెట్టని విషయం తెలిసిందే. నిండు సభలో తనను, కుటుంబ సభ్యులను అవమానించారని, ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ అప్పట్లో ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు దాన్ని నెరవేర్చుకున్నట్టయింది. ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతోన్నారు.












Click it and Unblock the Notifications