జగన్! ఎందుకంత ఆవేశం, అవకాశం ఇస్తా: స్పీకర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శనివారం శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీరుపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. "జగన్! మీకు ఎందుకు అంత ఆవేశం.. మీకూ మాట్లాడేందుకు అవకాశం వస్తుంది" అని అన్నారు. సభా స్థానాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేయడం తగదని ఆయన హితవు చెప్పారు.
ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైయస్ మాఫియా గత ప్రభుత్వంలో చెలరేగాయని శాంతిభద్రతలపై చర్చలో పాల్గొంటూ టిడిపి సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు జరిగిన మరణాలను కూడా టిడిపికి ఆపాదించారని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వంలో జరిగిన హత్యలకు ఆయుధాలు సరఫరా చేసింది ఎవరని ఆయన అడిగారు. గత ప్రభుత్వంలో గూండాలు, భూకబ్జాదారులు, వైట్ కాలర్ నేరగాళ్లు పాలన సాగించారని ఆయన అన్నారు. మంగలి కృష్ణకు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అమాయకుడని సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన అన్నారు.
తొలుత వాయిదా పడిన తర్వాత శాసనసభ తిరిగి సమావేశమైంది. సభ్యులు బేషజాలకు వెళ్లకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని యనమల రామకృష్ణుడు కోరారు. సభలో శుక్రవారం జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్తే బాగుంటుందని అన్నారు. ఆ తర్వాత సభలో శాంతిభద్రతల అంశంపై చర్చ కొనసాగింది.