ఏపీ అసెంబ్లీ సమావేశాలు- టీడీపీ బాయ్ కాట్..!! ముట్టడికి విద్యార్ధి సంఘాల పిలుపు-భారీ బందోబస్తు..!!
సుదీర్ఘ విరామం తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీ చివరి సమావేశం జరిగి ఆరు నెలలు పూర్తి కానుండటంతో..తప్పని సరిగా సభ సమావేశం కావాలి. దీంతో..ఈ ఒక్క రోజు సభ నిర్వహించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట సభలను అభాసుపాలు చేస్తోందని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ విమర్శలు చేసింది.

15 రోజుల సమావేశానికి టీడీపీ డిమాండ్
ఏపీలో ముఖ్యమైన సమస్యలున్నాయని, వాటిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తే నష్టమేంటని తెలుగు దేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత పూర్తి స్థాయి సమావేశాలకు ప్రభుత్వం సిద్దమని చెబుతోంది. అయితే, ముందుగా బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల సభ నిర్వహించాల నే దాని పై నిర్ణయం తీసుకోనున్నారు. బీఏసీలో సమావేశాల నిర్వహణ పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమావేశాలకు హాజరు కావాలని..లేకుంటే బహిష్కరించాలని టీడీపీ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

14 ఆర్డినెన్సులకు ఆమోదం
దీంతో..ఈ రోజు సభలో మహిళా సాధికారతపై స్వల్ప చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఒకేరోజున 14 ఆర్డినెన్స్లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఈ మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ, ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులెటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ చేయనున్నారు.

ఆన్ లైన్ మూవీ టిక్కెట్ల చట్టం సైతం
ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్సిటిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్ కార్పోరేషన్ల చట్ట సవరణ, ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణతో పాటు పలు ఆర్డినెన్సులను ఆమోదింపజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను యధాతధంగా కొనసాగించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
Recommended Video

విద్యార్ధి సంఘాల ముట్టడి పిలుపు...భారీ బందోబస్తు
ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జీవోలు 42, 50, 51, 35 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాలతో పాటు అసెంబ్లీకి వెళ్లే రహదారుల వద్ద పోలీసు అదనపు బలగాలు మోహరించారు.
విద్యార్థి సంఘాల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా... ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీని ముట్టడించి తీరుతామని విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. విజయవాడ, మంగళగిరి, రాజధాని గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఎయిడెడ్ విద్యా సంస్థల అంశంలో ప్రభుత్వ విధానం స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications