డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు: రెబల్స్ పైనే స్పెషల్ ఫోకస్!
ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాట్ హాట్ గా ఉన్న ఏపీ పాలిటిక్స్ ఈ సమావేశాల సమయంలో సభా వేదికగా మరింత ఆసక్తిని కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయి. వీటన్నింటి పైనా ప్రభుత్వం సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో స్పీకర్ పైన అనుచితంగా వ్యవహరించారనే అభియోగంతో టీడీపీ నేతల పైన ఇప్పటికే వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. దీని పైన ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక, టీడీపీ నుండి ఎమ్మెల్యేలు బయటకు వస్తారనే ప్రచారం నడుమ ఈ సమావేశాల్లో టీడీపీ రెబల్స్ ఎవరనేది తేలుతుందని అంచనా వేస్తున్నారు. వంశీ ఎపిసోడ్ పైన ఆసక్తి నెలకొంది.
ఏపీలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్: చంద్రబాబు హాయంలో కీలక అధికారి కేంద్రంగా: అధికారుల్లో కలకలం..!
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
డిసెంబర్ 9నుండి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తమ సంసిద్దతను వ్యక్తం చేస్తే అసెంబ్లీకి సమాచారం ఇచ్చింది. దీని పైన అసెంబ్లీ స్పీకర్ ఆదేశాల మేరకు కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలి రోజు సమావేశం మగిసిన తరువాత బీఏసీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ సమావేశంలో సభ జరగాల్సిన పని దినాలు..సమయం..చర్చించాల్సిన అంశాలు..ప్రభుత్వం నుండి లేవెనెత్తే చర్చలు.. తీర్మానాలు..ఖరారు చేయనున్నారు. అదే విధంగా ఏ అంశం మీద ఏ పార్టీకి ఎంత సమయం కేటాయించే అంశం మీదా అదే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అన్నింటి మీద చర్చకు సిద్దమని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వాన్ని నిలదీయటానికి తామ సిద్దమని ప్రతిపక్షం అంటోంది.
కీలక చర్చలు..ప్రివిలేజ్ నోటీసులు
ఈ సమావేశాల్లో ప్రస్తుతం అధికార...విపక్షాల మధ్య అనేక కీలక అంశాల మీద చర్చ సాగనుంది. ఇంగ్లీషు మీడియం పాఠశాలలు..ఇసుక సమస్య.. రాజధాని, పోలవరం, మద్యపాన నిషేధం వంటి అంశాల పైన చర్చకు సిద్దమని ప్రభుత్వం చెబుతోంది. ఇవే అంశాల పైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం సైతం సమాయత్తం అవుతోంది. ఇక, స్పీకర్ తమ్మినేని సీతారం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారం పైన వైసీపీ ఇప్పటికే స్పీకర్ కార్యాలయంలో వారి పైన చర్యలు తీసుకోవాలంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు.. కూన రవికుమార్ పైన చర్యలకు వైసీపీ డిమాండ్ చేస్తంది. దీని పైన స్పీకర్ తీసుకొనే నిర్ణయం ఆసక్తి కరంగా మారనుంది.
టీడీపీ నుండి హాజరయ్యేది ఎంత మంది..
ఇప్పటికే టీడీపీ నుండి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారు. అదే సమయంలో వైసీపీలో సైతం చేరలేదు. ఆయన పైన టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు ఆయన సభలో స్వతంత్ర అభ్యర్దిగా వ్యవహరిచాల్సి ఉంటుంది. అయితే, అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం టీడీపీ సభ్యుడిగానే ఉంటారు. ఇక, ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా తో సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లోగానే ఈ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ సైతం పార్టీని వీడి వైసీపీతో కలిసే వారి విషయంలో రివర్స్ ప్లాన్ తో సిద్దమవుతోంది. దీంతో..దాదాపు పది రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఈ సారి రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి.