దేశంలో గంజాయి గుప్పు వెనుక ఏపీ.. ఆధారాలతో సహా; విశాఖ గంజాయిపై పవన్ కళ్యాణ్ ట్వీట్ల వర్షం !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్ గా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా గంజాయి దందా ఏ విధంగా సాగుతుందో సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. అందుకు సంబంధించిన పలు ఆధారాలను మీడియాలో ప్రచురితమైన వార్తలను పవన్ కళ్యాణ్ వరుసబెట్టి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
టీడీపీ వర్సెస్ వైసీపీ: నిరసనల హోరు; చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై బొత్సా ఘాటు వ్యాఖ్యలు
వివిధ రాష్ట్రాల్లో దొరుకుతున్న గంజాయి అంతా ఏపీ నుండే
నల్గొండ ఎస్ పి రంగనాథ్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని ,దేశవ్యాప్తంగా ఏపీ నుంచి గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వరుసగా వివిధ రాష్ట్రాలలో పట్టుబడిన గంజాయి గ్యాంగ్ లను, వాటి మూలాలు ఏపీ లోనే ఉన్నాయి అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు దేశంలో గంజాయి రూట్ మొత్తం ఏపీ నుంచి ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రెస్ మీట్ ను పోస్ట్ చేశారు. ఆ తర్వాత కర్ణాటకకు వచ్చే గంజాయి మత్తు ఏపీ నుంచి వస్తుందని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మీడియా సమావేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కర్ణాటక, కేరళ , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లోనూ గంజాయి ఏపీదే
కేరళలో గంజాయి మొత్తం ఏపీ నుంచే వస్తుందని కేరళ పోలీసులు పెద్ద మొత్తంలో ఏపీ నుండి అక్రమ రవాణా అయిన గంజాయిని సీజ్ చేస్తున్న దృశ్యాలను ప్రజలకు తెలిసేలా పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ, మహారాష్ట్ర లోనూ, ముంబై లోనూ, పూణే లోనూ దొరుకుతున్న గంజాయి మొత్తం ఏపీ నుంచే వస్తుందని, ఇక దేశ రాజధాని ఢిల్లీని సైతం ఏపీ గంజాయి మత్తులో ముంచుతుందని ఢిల్లీ డీసీపీ సంతోష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ ను ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుండి రాజస్థాన్ రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా జరిగిందని ఆధారాలను ప్రజల ముందు ఉంచారు పవన్ కళ్యాణ్.
గంజాయి సాగు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన పవన్ కళ్యాణ్
ఇక ఈ సమయంలో గంజాయి సాగు గురించి అనేక కీలక విషయాలను పేర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశమని పేర్కొన్నారు. విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని, చదువు పూర్తయిన కుర్రాళ్లు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక గంజాయి కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
గంజాయిని ధ్వంసం చెయ్యకుండా రవాణా అయ్యే గంజాయిని పట్టుకుంటే సరిపోతుందా ?
మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉందని నవంబరు, డిసెంబరు నెల నుంచి పంట కోత మొదలవుతుందని అప్పుడు ఇంకా ఎక్కువగా బయటకు వెళుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గతంలో గంజాయిని పోలీసులు, ఆబ్కారి అధికారులు ధ్వంసం చేసే వారిని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఆ పని వదిలిపెట్టి బయటికి వెళ్లి గంజాయిని మాత్రమే పట్టుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీజ్ చేస్తున్న గంజాయి కంటే, ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి గంజాయి ఎక్కువగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
2018 జనసేన పోరాట యాత్ర నాటి విశాఖ ఏజెన్సీ పరిస్థితి వెల్లడించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తాను సాగించిన 2018 జనసేన పోరాట యాత్ర రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడిందని పేర్కొన్నారు. 'ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు'లోని గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్ మరియు 'గంజాయి వ్యాపారం & దాని మాఫియా' గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేశారు. ఏపీలో గంజాయి మూలాలు ఉన్నాయని, వివిధ రాష్ట్రాల్లో జరిగిన గంజాయి కేసులను , వాటి ఆధారాలతో సహా ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ మాదకద్రవ్యాల హబ్ గా ఏపీ మారిపోయిందని పేర్కొన్నారు. తన పర్యటన సమయంలో స్థానికులు ఒక క్లిష్టమైన క్రిమినల్ నెట్వర్క్ ఉందని తనకు చెప్పారని దానిని బహిర్గతం చేయడానికి వారు భయపడ్డారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ . భారత ప్రభుత్వం అరికట్టడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక అంతర్రాష్ట్ర టాస్క్ఫోర్స్ను ఉంచాలని తాను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.