హోదా-సాయం: పురంధేశ్వరి ఎదుటే బాబుని ఏకేసిన ఏపీ బీజేపీ ఇంఛార్జ్
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ దాస్ శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు. పరోక్షంగా బాబుకు చురకలు అంటించారు. నేను, నా భార్య సంపాదించుకున్న దానిని మేమే ఖర్చు చేసుకుంటామని, పొరుగు వారిని ఇవ్వమంటే ఎలా అని సెటైర్ వేశారు.
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చమంటున్నారని, వాటిని మేం అమలు చేస్తున్నామని, చిల్లర రాజకీయాలు వద్దన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ సాయపడుతుందన్నారు.
పోలవరం బాధ్యత మాదే
పోలవరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవితం అన్నారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపి పోలవరం ప్రాజెక్టుకు అనుకూలం చేశామని చెప్పారు. ఇదీ పోలవరంపై తమ చిత్తశుద్ధి అన్నారు. ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు అన్నారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. రాజకీయ కారణాలతో తమ పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులను కేంద్రమే ఇస్తుందని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అంటే 70 శాతం కేంద్రం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ భరిస్తుందన్నారు.
కానీ, బీజేపీ మాత్రం పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇలాంటప్పుడు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ఇస్తున్నట్లు కాదా అని అభిప్రాయపడ్డారు. కేంద్రానికి 'ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రమని' చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.వంద కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా తామే పూర్తి చేస్తామని, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి ఉమాభారతి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని చెప్పారు. పార్టీ సమావేశాల్లో చర్చించిన అంశాల పైన ఎప్పటికప్పుడు సమీక్షలు ఉంటాయని చెప్పారు. తాము ఏపీకి వీలైనంత సాయం చేస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. తాము రాజకీయంగా పైచేయి సాధించడం కోసం ఏమీ మాట్లాడటం లేదని చెప్పారు. హోదాకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు.
చంద్రబాబును కలుస్తా, చట్టం ఉల్లంఘన ఎక్కడ
విభజన చట్టంలోని హామీలను అన్నింటిని తాము తప్పకుండా నెరవేర్చుతామని చెప్పారు. వాటికి కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని చెప్పారు. చంద్రబాబు మాకు గౌరవప్రదమైన నేత అన్నారు. కేంద్ర రవాణా శాఖ ఏపీకి రూ.65 కోట్లకు పైగా ఇచ్చిందన్నారు.
ప్రత్యేక హోదా పైన ఏపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము అంతకంటే ఎక్కువ సాయం చేస్తామని చెప్పారు. విభజన చట్టంలోనీ హామీలన్నింటిని నెరవేర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్నారన్నారు. అలాంటప్పుడు మేం విభజన చట్టాన్ని ఎక్కడ ఉల్లంఘించామో చెప్పాలన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా చట్టంలోలేదని కేంద్రమంత్రులు చెప్పారన్నారు. కేంద్రం ఇస్తున్న నిధుల పైన ఏపీ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్రమంత్రి జయంత్ సిన్హా లేక పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మీడియా కూడా తప్పుడుగా చూపిందన్నారు. బీజేపీని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు.
చిల్లర రాజకీయాలు ఎవరూ చేయవద్దని హెచ్చరించారు. అందరూ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలన్నారు. రెవెన్యూ లోటు కింద 22,112 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఏపీపై తమ చిత్తశుద్ధి తాము ఇచ్చిన నిధులే చెబుతున్నాయన్నారు. రైల్వే జోన్ పైన కేంద్రం ఆలోచిస్తోందన్నారు.
జూన్ 13వ తేదీ కల్లా మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూన్, జూలైలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటిస్తారని చెప్పారు. విజయవాడలో జూన్ మధ్యలో మరోసారి పార్టీ సమావేశం ఉంటుందని చెప్పారు. బూత్ స్థాయి నుంచి తాము పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. బూత్ స్థాయి నుంచి పార్టీని విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు.












Click it and Unblock the Notifications