ఏపీలో పొత్తులు డిసైడ్-ఢిల్లీ సంకేతాలు- తేల్చేసిన బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు మాత్రమే ఉంటుందా లేక టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందా లేక మూడు పార్టీలు విడిగానే పోటీ చేస్తాయా అన్న దానిపై ఇవాళ బీజేపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా అమిత్ షా-చంద్రబాబు భేటీ తర్వాత మొదలైన ప్రచారానికి కొనసాగింపుగా ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయో ఆదినారాయణరెడ్డి స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ నుంచి అందిన సంకేతాల మేరకే తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నట్లు బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. ఢిల్లీ నుంచి తమకు ఈ మేరకు సంకేతాలు ఉన్నాయన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా తమ కూటమి పోటీ చేసి గెలవడం ఖాయమని కూడా ఆది తేల్చేశారు. దీంతో బీజేపీ-టీడీపీ పొత్తుపై జరుగుతున్న చర్చకు, ఈ మేరకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలపై ఓ స్పష్టత వచ్చినట్లయింది.

రాష్ట్రంలో ఈ మూడు పార్టీల మధ్య పొత్తు దిశగా చర్చలు జరుగుతున్నట్లు ఆదినారాయణరెడ్డి ఇవాళ వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలన అంతమొందించడమే లక్ష్యంగా ఈ పొత్తు ఉంటుందన్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి తమకు సంకేతాలు ఉన్నాయని, తాజాగా కేంద్రమంత్రి నారాయణస్వామి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆదినారాయణరెడ్డి గుర్తుచేశారు. కేంద్రం సంకేతాలు లేకుండా తాను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని కూడా ఆది ప్రశ్నించారు.
మరోవైపు సీఎం జగన్ కు కేంద్రం నుంచి అండదండలు లభిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపైనా ఆదినారాయణరెడ్డి స్పందించారు. కేంద్రం నుంచి జగన్ కు ఎలాంటి అండదండలు లేవన్నారు. సీబీఐ కేసులో జగన్ కు కేంద్రం అండగా నిలుస్తోందనేది కేవలం అపోహ మాత్రమేనని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ఆది పేర్కొన్నారు. నియోజకవర్గంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో కడప నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications