పవన్ కల్యాణ్ గురించి ఆలోచిస్తున్న BJP!
ఏపీ బీజేపీలో పవన్ కల్యాణ్ గురించి సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అకస్మాత్తుగా పవన్ హైదరాబాద్ లో చంద్రబాబుతో రెండోసారి సమావేశమవడంతో పార్టీ శ్రేణులు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లేందుకు మానసికంగా సిద్ధపడ్డారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.
విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పవన్ తమతోనే ఉంటాడని భావిస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ జనసేనకానీ, బీజేపీ కాని కలిసి ఉమ్మడిగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఇటీవల బీజేపీ నిర్వహించిన కార్యక్రమాలన్నీ సొంతంగా చేసుకున్నవే. అమరావతి గ్రామాల్లో పాదయాత్రకానీ, భీమవరంలో ప్రధానమంత్రి సభ కానీ, రాజమండ్రిలో గోదావరి గర్జననకు కానీ పవన్ ను ఆహ్వానించారా? లేదా? అనేదాంట్లో స్పష్టత లేదు.

ప్రధానమంత్రి మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని, అందరినీ కలుపుకొని వెళతానని చెబుతూ చంద్రబాబును కలవడంతో బీజేపీ నేతలు కూడా మానసికంగా సిద్ధపడిపోతున్నారు. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉన్నంతవరకు బీజేపీని కూడా కలుపుకొని వెళదామని ప్రయత్నిస్తున్నాయి. కానీ ఏపీ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయివున్నారని, ఒకవర్గం వైసీపీకి మద్దతుగా, మరో వర్గం టీడీపీకి మద్దతుగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో తన నిర్ణయం తాను తీసుకోవడమే ఉత్తమం అన్న భావనకు పవన్ కల్యాణ్ వచ్చారని సీనియర్ రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. కాకపోతే బీజేపీ నేతలకు మింగుడు పడని విషయం ఏమిటంటే మోడీ మాట్లాడిన తర్వాత కూడా జనసేనాని టీడీపీతో కలిసి ముందుకు సాగేందుకు సంకేతాలు ఇవ్వడమే. ఒకరకంగా వారిని ఇది తీవ్ర షాక్ కు గురిచేసిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications