ఏపీలో బీజేపీ మార్క్ రాజకీయం - కీలక పరిణామాలు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. మిత్రపక్షాలుగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆసక్తి కర సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాదిన బలోపేతం పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా బలం పెంచుకోవటానికి ఈ సమయమే సరైనదిగా భావిస్తోంది. అందులో భాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఏపీ బీజేపీ నేతలు ప్రధానితో భేటీ అయ్యారు. బీజేపీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
కీలక పరిణామాలు
ఏపీలో బీజేపీ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదిగేలా కార్యాచరణ ఉండాలని రాష్ట్ర పార్టీ నేతలకు నాయకత్వం స్పష్టం చేసింది. మిత్రపక్ష పార్టీలతో సయోధ్యతో వ్యవహరిస్తూనే.. పార్టీ బలం పెంచుకునే ఏ అవకాశం వదులుకోవద్దని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. తాజాగా పార్టీ నేతలు ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. రాష్ట్రం లో కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు.. తాజా రాజకీయ పరిణామాల పైన ప్రధానికి వివరించారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం పైన ప్రజల్లో సానుకూలత కనిపిస్తోందని ఏపీ నేతలు చెప్పుకొచ్చారు. ఏపీకి అందిస్తున్న సాయం పైన ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు.

బీజేపీ వ్యూహాలు
ఏపీలో బీజేపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా.. తమ బలం కోల్పోకూడదని రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్ష పార్టీలతో పట్టు బట్టి సాధిస్తోంది. రాజ్యసభ లో ఇప్పటికే ఏపీ నుంచి ఒక సీటు దక్కించుకోగా.. తాజాగా చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా వ్యవహ రించిన బీజేపీ నేతలు ఎమ్మెల్సీ సీటు సొంతం చేసుకున్నారు. వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం సైతం తమకే ఇవ్వాలంటూ బీజేపీ ఇప్పటికే కూటమి మిత్రపక్ష పార్టీలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి పైన మంత్రాంగం చేస్తోంది.
భవిష్యత్ రాజకీయం
ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి స్థానంలో కొత్త చీఫ్ నియామకం పైన బీజేపీ నేతలు ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసారు. అందులో భాగంగా సామాజిక సమీకరణాల పైన ప్రత్యేకంగా చర్చ జరిగింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి వర్గం కు ఈ సారి పదవి ఇవ్వాలని తొలుత భావించారు. అయితే, బీసీ నేతకు ఇవ్వాల్సిన అవసరం గురించి చర్చ మొదలైంది. బీసీ కార్డుతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బలోపేతం కావటం పైన బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణ పైన సానుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో.. బీసీ కార్డు తమ భవిష్యత్ రాజకీయ ఎదుగుదలకు మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో, వచ్చే వారం బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించేలా రంగం సిద్దం అవుతోంది. దీంతో.. రానున్న రోజుల్లో బీజేపీ తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications