రివర్స్: బాబు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాసం ప్లాన్, 'జగన్ ఇక్కడ అడిగిన ప్రశ్నలే టీడీపీ అడిగింది'
అమరావతి: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం వీగిపోయిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఇందుకు ఆ పార్టీ శాసన మండలి సభ్యులు మాధవ్ వ్యాఖ్యలే నిదర్శనం. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ఫోన్ చేసి జగన్ ఉచ్చులో పడొద్దని చెప్పా, ఏపీకి ఇదే నా హామీ, యూటర్న్: బాబును దులిపేసిన మోడీ
తెలుగుదేశం పార్టీ ఎంపీలు చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాధవ్ నిప్పులు చెరిగారు. లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావులు వేర్వేరుగా టీడీపీపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధిపై జీవీఎల్ కౌంటర్
సమైక్య ఏపీగా ఉన్న సమయంలో చంద్రబాబు అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయకుండా ఇప్పుడు తమకు హైదరాబాద్ లేదంటే ఎలా అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు టీడీపీపై ఎదురుదాడి చేశారు. నాడు చంద్రబాబు చేసిన తప్పు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగడంలో కాంగ్రెస్కు ఎంత పాత్ర ఉందో టీడీపీకి అంతే పాత్ర ఉందన్నారు. తెలంగాణలో సెంటిమెంటు ఉందని తెలిసినప్పటికీ భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు. తద్వారా హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇలా కౌంటర్ ఇచ్చారు.
అప్పుడు నష్టం చేసిన విషయం తెలియదా?
గాలి మాటలతో ఓట్లు పోందాలని టీడీపీ చూస్తోందని, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మోడీకి, జైట్లీకి ఆనాడు థ్యాంక్స్ చెప్పి, ఇప్పుడు టీడీపీ యూటర్న్ తీసుకుందని జీవీఎల్ విమర్శించారు. ప్రజలకు తప్పుడు మాటలు చెబుతూ పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయన్నారు. సీమాంధ్ర జిల్లాల ఆదాయం తీసుకెళ్లి హైదరాబాద్ను నిర్మించానని చెప్పుకుంటున్నారని, అప్పుడు ఏపీకి నష్టం చేస్తున్నామని తెలియదా అన్నారు.
స్పెషల్ పర్పస్ వెహికిల్ పైన
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, విశాఖపట్నం-కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్లపై త్వరలో ఒకదాని తర్వాత మరొకటిగా నిర్ణయాలు వెలువడుతాయని హరిబాబు చెప్పారు. స్పెషల్ పర్పస్ వెహికిల్ గురించి ఎవరికి చెప్పారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు లోకసభలో శుక్రవారం ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో గతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా పలుమార్లు స్పందించారని చేశారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో జగన్ అడిగిన ప్రశ్నలే, లోకసభలో టీడీపీ నేతలు అడిగారు
బీజేపీది పలాయనవాదం కాదని, అభివృద్ధి, జాతీయవాదమని సోము వీరాజ్రు అన్నారు. 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు శంకుస్థాపన చేయలేదని నిలదీశారు. అసెంబ్లీలో జగన్ అడిగిన ప్రశ్నలే పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు చదివారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ తోడుదొంగలన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ పాలన సాగుతోందన్నారు. బీజేపీకి ఓట్లు పడకపోయినా, డిపాజిట్లు దక్కకపోయినా దేశంకోసం పోరాటం చేస్తుందన్నారు. తమకు జాతీయవాదం ముఖ్యమన్నారు.