వైసీపీని వదిలి మాపై ఏడుపెందుకు- ఇంకా కుట్ర రాజకీయాలేనా- టీడీపీపై విష్ణు తీవ్ర వ్యాఖ్యలు..
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం టీడీపీ, బీజేపీ నేతల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ప్రధానంగా మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం ఉండబోదంటూ బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇస్తున్న కౌంటర్లపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాతో పాటు పలు ఛానళ్లలో బీజేపీ నేతలపై టీడీపీ విరుచుకుపడుతుండటంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ కుల, కుట్ర రాజకీయాలు ఇంకెన్నాళ్లు, ఇంకెన్నేళ్లు అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని పొగుడుతూ ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాస్తుంటే కింది స్ధాయి నేతలు తమ పార్టీ రాష్ట్ర నేతలపై విమర్శలకు దిగడం పట్ల విష్ణు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇదేం రాజకీయం అంటూ ఆక్షేపించారు. టీడీపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని విష్ణు సూచించారు.
గతంలో టీవీలు, పత్రికలు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేశారని, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా టీడీపీ, చంద్రబాబు రాజకీయం చేస్తున్నాయని విష్ణు విమర్శించారు. ప్రతిపక్షంగా టీడీపీ చేయలేని పనిని తాము చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. తమ నేతలు సోము, జీవీఎల్పై టీడీపీ చేస్తున్న కుల విష ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ పేరుకు జాతీయ పార్టీ అని చేసేది వీధి రాజకీయాలు అంటూ విష్ణు విరుచుకుపడ్డారు.
టీడీపీని ఏపీ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని, ఇప్పుడు అది పేపర్ పులి మాత్రమేనని విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇప్పుడు ట్విట్టర్, జూమ్లకే పరిమితం అయ్యారన్నారు. పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ తో మొదలుపెట్టి ఇప్పటివరకూ టీడీపీ చేస్తున్నవి కుట్ర రాజకీయాలేనన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీ ఎందుకు భయపడుతుందో ప్రజలకు అర్దమవుతోందని విష్ణు వ్యాఖ్యానించారు. విపక్ష నేత చంద్రబాబు రాష్ట్రం వదిలి తెలంగాణలో ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. తమ ఎంపీ జీవీఎల్కి క్రిస్టియానిటీ అంటగడుతున్న బుచ్చయ్య చౌదరి కుల దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆయన ఆరోపణలకు రుజువుందా అని విష్ణు ప్రశ్నించారు.
టీడీపీ బాటలో బీజేపీపై విమర్శలు చేస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపైనా విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు వేరే వాళ్లు చాలా పనులు అప్పజెప్పారని, వాటిలో బిజీగా ఉండాలని ఆయనకు సూచించారు. బీజేపీకి రాష్ట్రంలో ఏం చేయాలో మేం చూసుకుంటామన్నారు. బీజేపీకి సలహాలు ఇచ్చే స్ధాయికి రఘురామరాజు ఇంకా ఎదగలేదన్నారు. గతంలో తమ కండువా కప్పుకున్నందుకు వీలైతే కృతజ్ఞులుగా ఉండాలని విష్ణు సలహా ఇచ్చారు.