మంత్రివర్గం మల్లగుల్లాలు: చంద్రబాబుపై కేసు పెడితే...
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో ప్రధానంగా నోటుకు ఓటు కేసుపై, భవిష్యత్తు పరిణామాలపై చర్చ జరిగింది. చంద్రబాబుపై కేసు పెడితే ఏం చేయాలనే విషయంపై కూడా చర్చ సాగింది. రేవంత్ రెడ్డి అంశంలో చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తే ఏం చేయాలనే అంశంపైనా ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది.
ఒక రాష్ట్ర సీఎంపై కేసు నమోదుకు మరో రాష్ట్రానికి చట్ట పరిధి లేదని, ఆ పని చేస్తారని అనుకోమని, అయినా, ఆ పని చేస్తే మనం మరోసారి మంత్రివర్గ సమావేశం పెట్టి చర్చించి నిర్ణయం తీసుకుందామని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ అభియోగంపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా చర్చ జరిగింది. ఈ అంశంపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని, విచారణలో వాస్తవాలు బయటికి వస్తాయని, అప్పుడు, వాటి ఆధారంగా బర్తరఫ్ డిమాండ్ను తీసుకొస్తే బాగుంటుందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవసరాలకు పూర్తిగా ఏపీ పోలీసులనే వినియోగించాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. సెక్షన్ 8 అమలుపై కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందో చూసి, దానిని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications