Nellore ఇద్దరు మంత్రుల్లో ఒకరు ఔట్: కొత్తగా అవకాశం దక్కేదెవరికి : కృష్ణా జిల్లా సమీకరణాలతో లింకు.!
ఏపీలో మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. దీంతో..జగన్ కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో టెన్షన్ మొదలైంది. 2019లో కేబినెట్ ఏర్పాటు సమయంలో రెండున్నారేళ్లు మాత్రమే ఈ మంత్రివర్గం ఉంటుందని..తరువాత 90 శాతం వరకు మార్పులు జరుగుతాయని సీఎం నాడే స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు తాజాగా కొంత మంది మంత్రులకు ముఖ్యమంత్రి పార్టీ సమన్వయ కర్తల ద్వారా ఎవరు మంత్రివర్గం నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుందనే దాని పైన పరోక్షంగా సంకేతాలు అందిస్తున్నారు.
నెల్లూరు లో ఆసక్తికర సమీకరణాలు..
అందులో భాగంగా.. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో కంటిన్యూ అయ్యే దెవరు...అవుట్ అయ్యేదెవరు అనే అంశం పైన ఆసక్తి కర చర్చ తెర మీదకు వస్తోంది. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో మంత్రి పదవులకు..కృష్ణా జిల్లా సమీకరణాలతో లింకు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇద్దరు యువ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్...మేకపాటి గౌతం రెడ్డిలను జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ జగన్ కేబినెట్ లో కీలకంగా మారారు. కానీ, ఇద్దరూ మంత్రివర్గంలో కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జిల్లాలో తొలి నుండి జగన్ తో నడుస్తున్న వారు..సీనియర్లు మంత్రి పదవుల పైన ఆశలు పెంచుకుంటున్నారు. కానీ, పక్కా సామాజిక సమీకరణాలతో ముందుకెళ్లే సీఎం జగన్..ఇప్పుడూ అదే అమలు చేయనున్నారు.
రేసులో సీనియర్లు..ఛాన్స్ దక్కేనా
అందులో భాగంగా మేకపాటి గౌతమ్ రెడ్డి కి పోటీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మూడు సార్లు టీడీపీ..మూడు సార్ల వైసీపీ నుండి గెలుపొందారు. ఆయన తో పాటుగా జిల్లా సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణ రెడ్డి సైతం కేబినెట్ బెర్తు ఆశిస్తున్నారు. అయితే, ఆయన 2019 ఎన్నికల ముందే పార్టీలోకి రావటం మైనస్ గా కనిపిస్తోంది. అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు సైతం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, గౌతమ్ తండ్రి రాజమోహన రెడ్డి వైసీపీ తొలి ఎంపీగా వ్యవహరించారు. ఆ కుటుంబంలో ఇద్దరు ఇప్పుడు అదే జిల్లా నుండి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మేకపాటి కుటుంబంతో జగన్ కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా గౌతమ్ ను తప్పిస్తారా లేదా అనేది డౌట్ గా మారింది. ఆయన్ను కొనసాగిస్తూ అదే వర్గానికి చెందిన మరో రెడ్డి నేతకు మంత్రి పదవి వస్తుందా అంటే అదీ అనుమానమే.
అనిల్ తో ఆ జిల్లాకు లింకు..
సంజీవయ్య సైతం రేసులో ఉన్నారు. ఆయనకు అవకాశం దక్కాంటే అనిల్ తో పాటుగా పొరుగు జిల్లాల్లో సమీకరణాల పైన స్పష్టత రావాల్సి ఉంటుంది. అనిల్ కుమార్ ను తప్పించి మరో రెడ్డి నేతకు ఇవ్వాలంటే ఇప్పుడు కేబినెట్ లో ఉన్న రెడ్డి వర్గం మంత్రుల్లో ఒకరిని తగ్గించాల్సి ఉంటుంది. కానీ, ఆ సమీకరణ సాధ్యపడేలా లేదు. ఇక, అనిల్ ను తప్పిస్తే..ఖచ్చితంగా యాదవ వర్గానికి కేబినెట్ లో అవకాశం కల్పించాల్సిన పరిస్థితి. ఇందు కోసం కృష్ణా జిల్లా నుండి పెనమలూరు ఎమ్మెల్యే..మాజీ మంత్రి పార్ధసారధికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు.
వారు సేఫ్...రీప్లేస్ మెంట్ ఎవరితో..
కాపు వర్గం నుండి పేర్ని నాని..కమ్మ వర్గం నుండి కొడాలి నాని బెర్తులు సేఫ్. వారిని తొలిగించే అవకాశం కనిపించటం లేదు. ఇక, మరో మంత్రి వెల్లంపల్లిని తప్పించి ఆయన స్థానంలో పార్ధసారధికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, వెల్లంపల్లి స్థానంలో ప్రకాశం లేదా విజయనగరం నుండి వైశ్య వర్గానికి అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇరిగేషన్ వ్యవహారాలు కీలకంగా ఉన్న పరిస్థితుల్లో అనిల్ ను ఎంత వరకు తప్పిస్తారనేది వేచి చూడాల్సిందే.
అంతు చిక్కని జగన్ ఆలోచన..
ఇదే సమయంలో నెల్లూరు జిల్లా నుండే యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక పారిశ్రామిక వేత్త కొంత కాలం క్రితం వైసీపీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి..మంత్రి పదవి ఇస్తారనే చర్చ సాగుతోంది. ఆయన కోసం పార్టీలో సీనియర్ పార్లమెంట్ సభ్యులు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, జల్లాలో సీనియర్లు..తొలి నుండి జగన్ ను నమ్ముకున్న వారిని కాదని ఆయనకు అవకాశం ఇవ్వరనేది ఆశావాహుల ధీమా. నెల్లూరు జిల్లా నుండి రెడ్డి వర్గం పెద్ద ఎత్తున సీఎం పైన ఒత్తిడి చేస్తున్న క్రమంలో ఈ జిల్లా నుండి సీఎం ఎటువంటి సమీకరణాలు అమలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది