ఎయిర్ఇండియా విమాన ప్రమాదానికి ఏడాది.. అసలు జరిగింది ఇదీ..??
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి రేపటితో ఏడాది పూర్తవుతుంది. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ఇండియా ఏఐ-171 విమానం లండన్ కు బయల్దేరింది. కానీ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్ పై కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక్కరు మినహా విమానంలోని ప్రయాణికులందరూ అంటే 241 మంది చనిపోయారు. వీరిలో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు, ఒక కెనడియన్ ఉన్నారు. అలాగే మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం హాస్టల్ పై పడిన తరుణంలో హాస్టల్ లోని విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా మొత్తం ఈ విమాన ప్రమాదంలో 271 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఎయిర్ఇండియా సంస్థ ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇచ్చింది.
ఎయిర్ఇండియా విమాన ప్రమాదం అనంతరం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమానం గాల్లోకి లేచిన వెంటనే రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఇందుకు కారణం ఇంజిన్ ఇంధనాన్ని నియంత్రించే స్విచ్ లు ఒక్క సెకన్ వ్యవధిలోనే రన్ పొజిషన్ నుంచి కట్ఆఫ్ పొజిషన్ కూ మారిపోవడం అని తెలిపింది. ఈ స్విచ్ లు ఎలా మారాయన్న విషయం దర్యాప్తులో కీలకంగా మారింది. అయితే వెస్ట్రన్ మీడియా కథనాల ప్రకారం.. పైలట్లే పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా ఆ స్విచ్ లను ఆపివేసి ఉంటారని ప్రచారం జరిగింది. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో ఒక పైలట్.. నువ్వు ఫ్యూయల్ ఎందుకు కటాఫ్ చేశావ్ అని అడగ్గా.. నేను చేయలేదు అని సమాధానం ఇచ్చినట్లు ఉంది. దాంతో వెస్ట్రన్ మీడియాలు పైలట్ సుమీత్ సభర్వాల్ దే తప్పు అని తేల్చాయి.
అయితే భారతీయ పైలట్ల సంఘం, విమానయాన నిపుణులు, బోయింగ్ విజిల్ బ్లోయర్లు దీనిని తీవ్రంగా ఖండించాయి. విమానంలో సంభవించిన తీవ్రమైన విద్యుత్ లోపం కారణంగానే అలా జరిగి ఉంటుందని వారు వాదిస్తున్నారు. విమానం టేకాఫ్ అయినప్పుడు భారీ షార్ట్ సర్క్యూట్ లేదా సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా.. ఫిజికల్ గా స్విచ్ లు మారకపోయినా ఫ్లైట్ రికార్డర్ లో అవి కటాఫ్ అయినట్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ అనే సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రమాదానికి గురైన 11 ఏళ్లనాటి ఈ బోయింగ్ 787 విమానంలో అంతకుముందు కూడా అనేక తయారీ, నిర్వహణ లోపాలు, విద్యుత్ వ్యవస్థ వైఫల్యాలు ఉన్నట్లు యూఎస్ సెనెట్ సబ్ కమిటీకు నివేదించింది.

ఇక చివరగా ఈ విమాన ప్రమాదం పైలట్ల పొరపాటు వలన జరిగిందా..? లేక అంతర్గత సాంకేతిక లేదా విద్యుత్ లోపాల వల్ల జరిగిందా అనేది తేలాల్సి ఉంది. తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఇది సాంకేతిక లోపం అని తేలితే గ్లోబల్ ఏవియేషన్ రంగంలో బోయింగ్ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications