మంత్రి కొడాలి నాని స్థానం ఎవరికి - వంశీకి ఛాన్స్ ఇస్తారా : పోటీలో మరో ఇద్దరు..!!
ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం దగ్గర పడుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి కానుంది. దీంతో..పూర్తిగా అటు పార్టీ ..ఇటు ప్రభుత్వంలో మార్పుల దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా..ప్రస్తుతం ఉన్న మంత్రులను దాదాపుగా మార్చేస్తారని..వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

కొడాలి నాని ని తప్పిస్తారా
అయితే, ప్రస్తుత కేబినెట్ లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొడాలి నానిని మిగిలిన మంత్రులతో పాటుగా కేబినెట్ నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని పార్టీలో చర్చ కొనసాగుతోంది. అయితే, టీడీపీ..ప్రధానంగా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పైన మండిపడే మంత్రి కొడాలి నాని స్థానాన్ని భర్తీ చేసే వారెవరు ఉన్నారనే సందేహం వ్యక్తం అవుతోంది. టీడీపీ..జనసేన సైతం మంత్రి కొడాలి నాని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే, సీఎం జగన్ తనకు కొడాలి నాని తో ఎటువంటి మైత్రి ఉందో శాసనసభా వేదికగా చెప్పారు. మంత్రివర్గ ప్రక్షాళన చేసే సమయంలో సీఎం జగన్ ఖచ్చితంగా సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు పాటిస్తారు.

ఆ స్థానంలో కొత్తగా వచ్చేదెవరు
దీంతో..కొడాలి నాని సామాజిక వర్గానికి చెందిన వారకే నాని స్థానంలో కేబినెట్ లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తీసుకుంటారనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అందు కోసం ఆయనతో గన్నవరం సీటు కు రాజీనామా చేయించి..కేబినెట్ లోకి తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, గతంలో టీడీపీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని..వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వటం తో భారీగా డామేజ్ అయింది. దీంతో..వల్లభనేని వంశీ కాకుంటే మరో ఇద్దరికి అదే జిల్లా నుంచి మంత్రివర్గంలో అవకాశం ఉందని చెబుతున్నారు. అందులో మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణప్రసాద్ పేరు వినిపిస్తోంది. ఆయన టీడీపీ పైన నియోజకవర్గంలో సై అంటే సై అంటున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా పైన రాజకీయంగా పోరాటం చేస్తున్నారు.

సీఎం మొగ్గు ఎవరి వైపు
ఆయన తొలి సారి ఎమ్మెల్యే. అదే విధంగా తాజాగా ఎమ్మెల్సీ అయిన సీఎం సలహాదారుగా ఉన్న తలశిల రఘురాం పేరు సైతం రేసులో ఉంది. ఆయన జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఆయనకు విధేయుడిగా ఉంటున్నారు. జగన్ పాదయాత్ర మొత్తం ఆయనే పర్యవేక్షించారు. ఇక, ఇప్పటికీ సీఎం కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో..సీఎం ఏరి కోరి ఆయన్ను ఎమ్మెల్సీ గా ఎంపిక చేసారు. అయితే, కొడాలి నాని స్థాయిలో టీడీపీని ఎదుర్కొనే..అదే సామాజిక వర్గానికి చెందిన వారికి సీఎం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు - ప్రకాశం జిల్లాల నుంచి అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నా..క్రిష్ణా జిల్లా నుంచే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు.

క్రిష్ణా జిల్లాకు మళ్లీ మూడు పదవులు
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటంతో టీడీపీని ఆ జిల్లాలో కొంత వరకు ఆత్మరక్షణలో పడేసిన వైసీపీ...జిల్లాలో పట్టు కొనసాగించాలని భావిస్తోంది. అందులో భాగంగా..ఇప్పుడు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కేబినెట్ లో ఉన్నారు. ఆ ముగ్గురినీ తప్పిస్తే...జిల్లా నుంచి కమ్మ - కాపు - బీసీ వర్గాలతో ఈ సారి కేబినెట్ లో అవకాశం ఇస్తారనేది పార్టీ నేతల అంచనా. వైశ్య సామాజిక వర్గానికి మరో జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..అసలు.. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో గతంలో సీనియర్ మంత్రులు చెప్పినట్లుగా అందరినీ తప్పిస్తారా.. లేక, కొందరిని కొనసాగిస్తారా.. క్రిష్ణా జిల్లాలో కొడాలి నానిని తప్పిస్తే..ఎవరితో ఆ స్థానం భర్తీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications