కొత్త మంత్రులతో నేడు తొలి భేటీ - సీఎం తేల్చేస్తారా : దిశ - మోటర్లకు మీటర్లు..!!
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. కొత్త మంత్రులతో గత నెల 11న ఏపీ కేబినెట్ కొలువు తీరింది. ఆ తరువాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా 2024 ఎన్నికల టీంగా ఎంపిక చేసుకున్న ఈ సమావేశంలో...రాష్ట్రంలో పరిస్థితుల పైన మంత్రులకు వివరించనున్నారు. తొలుత శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగేలా నిర్ణయించినా..ఆ తరువాత ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల కారణంగా ఈ రోజుకు మార్చారు.
దిశ చట్టం ఆమోదానికి వీలుగా సవరణలు
దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మ ఒడి పథకం గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఏపీలో మహిళల పై అత్యాచారాలు... ప్రశ్న పత్రాల లీకేజీ విషయంలో జరుగుతున్న ప్రచారం - వాస్తవాల పైనా సీఎం జగన్ తన మంత్రివర్గ సహచరులతో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది.
మంత్రుల వ్యాఖ్యలు..తాజా వివాదాలు
ఇక, కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం తరువాత జిల్లాల పర్యటనల సమయంలో చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల విమర్శలకు కారణమయ్యాయి. వీటి పైన సీఎం వారి నుంచి వివరణ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం..దానిని తిప్పికొట్టటంలో మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం మరోసారి స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. వ్యవసాయ పంపు సెట్లకు మొటార్ల ఏర్పాటు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో అమలు చేసారు.
రాజకీయంగా సీఎం దిశా నిర్దేశం
రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం..రైతుల ఖాతాల్లోనే నేరుగా దానికి సంబంధించిన బిల్లుల మొత్తాన్ని జమ చేయటం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. ఇక, ప్రభుత్వం ప్రారంభించిన గడప గడపకు ప్రభుత్వం పైన సీఎం కీలక మార్గనిర్దేశం చేయనున్నారు.
కొత్త మంత్రులు.. మాజీ మంత్రులు.. జిల్లా అధ్యక్షులను కలుపుకు పోవాలని సీఎం మరోసారి సూచించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..పాలనా పరమైన నిర్ణయాలతో పాటుగా.. రాజకీయంగానూ సీఎం జగన్ మంత్రులకు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త మంత్రులు తొలి సారి కేబినెట్ భేటీకి హాజరు కానుండటంతో వారిలో ఈ భేటీ పైన ఆసక్తి కనిపిస్తోంది.