ఉచిత బస్సు, రైతు భరోసా అమలు ముహూర్తం ఖరారు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పైన వైసీపీ విమర్శలు చేస్తున్న సమయంలో పథకాల అమలు పైన ఫోకస్ చేసింది. పాలనా పరంగానూ కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. జమిలి ఎన్నికల ప్రచారం వేళ ముందస్తు నిర్ణయాలు అవసరమని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో, ఈ నెల 20న జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
20న కేబినెట్ భేటీ
నేడు జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం 20వ తేదీకి వాయిదా పడింది. ముఖ్యమంత్రి సోదరుడు అనారోగ్యంతో మృతి చెందటంతో సమావేశం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఈ సారి మంత్రివర్గంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో కొత్త పాలసీలతో పాటుగా కొత్త పెట్టుబడుల కోసం ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదనల పైన నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అదే విధంగా సూపర్ సిక్స్ హామీల అమలుకు మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

పథకాల పై చర్చ
ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. బడ్జెట్ లో రైతులకు రూ 20 వేలు, అమ్మకు వందనం కు నిధులు కేటాయించింది. అయితే, పూర్తి స్థాయిలో అమలుకు వీలుగా ఆ కేటాయింపులు లేవని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో, జనవరిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో రూ 20 వేల జమ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు సమాచారం. వాలంటీర్ల కొనసాగింపు అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. అయిదు నెలలుగా వారికి విధులు కేటాయించ లేదు. వేతనాలు ఇవ్వలేదు.
సంక్రాంతి నుంచి అమలు
బడ్జెట్ లోనూ వాలంటీర్ల కోసం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అమ్మకు వందనం పథకం పైనా చర్చించనున్నారు. తాజా బడ్జెట్ లో ఈ పథకాలకు చేసిన కేటాయింపులతో అందరికీ అమలు చేయటం సాధ్యం కాదని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీంతో, ముందుగా సంక్రాంతి వేళ రెండు పథకాలు అమల్లోకి తీసుకొచ్చేలా ఆలోచన జరుగుతోంది. ఈ మేరకు ఈ నెల 20న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications