రాజధానిలో రైతుల ఆందోళన: స్థలాలు ఎక్కడ ఇస్తారో చెప్పాలని నిలదీత
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. సింగపూర్ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి రైతులకు వివరించేందుకు గుంటూరు జిల్లా అధికారులు బుధవారం ఓ సదస్సుని ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు మొత్తం 29 గ్రామాల రైతులలు ఆహ్వానించారు. ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఆర్డీఏ పరధిలో మూడు వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం సమాంతర రోడ్లకే ప్రాధాన్యం ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
ఆరు గ్రామాల మధ్యలో నుంచి రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లోని ఒకటి రెండు ఇళ్లు పోతాయని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. దీంతో రైతలు సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ తమకు అక్కర్లేదని గ్రామాల మధ్యలోనుంచి రోడ్లు వెళ్తాయా లేదా అన్న విషయాన్ని తెలియజేయాలని అధికారులను నిలదీశారు.
ఎక్స్ప్రెస్ హైవేల పేరుతో ఊరు నడిమధ్య నుంచి రోడ్లు వేస్తున్నారని, ఇప్పటికప్పుడు ఇళ్లు ఎలా తొలగించాలని మండిపడ్డారు. మధ్యలో కలగజేసుకున్న మంత్రి నారాయణ రాజధాని ఎక్స్ప్రెస్ హైవేల వల్ల ఇల్లు పోతాయని వస్తున్న వార్తలు సరికాదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు మూడు కిలోమీటర్ల రోడ్లపైనే అభ్యంతరాలు వచ్చాయని, రైతులు అంగీకరిస్తేనే గ్రామాల మధ్య నుంచి రోడ్లు వేస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి ఒకటిన రాజధాని రైతుల కోసం మాస్టర్ ప్లాన్ను సీఆర్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
రైతులు మాత్రం తమ నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసిన తర్వాత తమకు స్థలాలు ఇస్తామని గతంలో చెప్పారని, ఆ స్థలాలు ఎక్కడ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సాయంత్రం 4 గంటల తర్వాత గ్రామాలకు సంబంధించిన సమస్యలపై రైతులతో మాట్లాడనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... రాజధాని ముఖ్య నగర నిర్మాణంలో ఏ గ్రామాన్నీ ఖాళీ చేయించమని హామీ ఇచ్చారు. ప్రణాళికలోని అంశాలపై గ్రామాల వారీగా, అంశాల వారీగా చర్చించి సవరణలు చేయిస్తామన్నారు. 29 గ్రామాలలో అభిప్రాయాలు, సలహాలు స్వీకరిస్తామన్నారు.
గ్రామాలను తరలించే ప్రసక్తిలేదని స్ఫష్టం చేశారు. ఎవరికి అన్యాయం జరగనీయమని, జరీబు రైతులకు జరీబు ప్రాంతంలోనే ప్లాట్లు ఇస్తామని తెలిపారు. రహదారులు వెళ్ళే గ్రామాలైన ఉండవల్లి, యర్రబాలెం ఐననోలు రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని శ్రీకాంత్ వెల్లడించారు.