2 సంవత్సరాలే ఉంది..!! ముఖ్యమంత్రి జగన్ ఎదుట భారీ లక్ష్యం??
ముఖ్యమత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. మరో రెండు సంవత్సరాల పదవీకాలమే మిగిలింది. ఈలోగా చేపట్టాల్సిన పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ పనులన్నింటినీ పూర్తిచేయడానికి, ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవడానికి తక్కువ సమయమే ఉండటంతో జగన్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం నుంచి అందని నిధులు
రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాహదారిపై అడుగులోతు, రెండడుగుల లోతుల్లో గుంతలున్నాయి. వాటిని పూడ్పించడానికి, నూతన రహదారులు వేయడానికి ప్రభుత్వం దగ్గర అవసరమైన నగదు లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందడంలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చడంలేదు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకే నిధులు ఇవ్వలేదు. ప్రత్యేక హోదాకానీ, హోదాకు తగ్గ ప్యాకేజీ కానీ ఇస్తామన్నారుకానీ ఆ విషయంలో కూడా కేంద్రం మాట తప్పింది. కానీ ప్రభుత్వం తరఫున కేంద్రాన్నిగట్టిగా నిలదీసే నాయకులే కరువయ్యారంటూ తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.
సంక్షేమ పథకాలకే ఇబ్బందులెదురవుతున్నాయి!
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు అవసరమైన నగదును సమకూర్చుకోవడానికే ఆర్థిక శాఖ నానా ఇబ్బందులు పడుతోంది. ఇటువంటి తరుణంలో నూతన రహదారుల నిర్మాణంతోపాటు ఇతర మౌలిక సౌకర్యాలకు నగదు కావాలంటే కష్టమేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే తమ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎన్నికల వరకు ఎలాగైనా సంక్షేమ పథకాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నారని, వాటికోసం ఆర్థిక సంస్థల దగ్గర, బ్యాంకుల దగ్గర అప్పు చేసుకోవడానికి కేంద్రం అనుమతిచ్చిందని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.
కాలగర్భంలో కలిసిపోయిన 2 సంవత్సరాలు
కొవిడ్ వల్ల రెండు సంవత్సరాల పూర్తికాలం కాలగర్భంలో కలిసిపోయింది. ఇటువంటి తరుణంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థలు ధైర్యం చేసి ముందుకు రాలేదు. ఉన్న సంస్థలను కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని సంస్థలను ప్రారంభించారు. వెనకబడిన జిల్లాల పరిస్థితి ఏమిటి? అమరావతినే కొనసాగిస్తారా? మూడు రాజధానులకే ప్రాధాన్యత ఇస్తారా? పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? పింఛనుకు ఇచ్చే సొమ్మును పెంచాల్సి ఉంది? దానికి ఏం సమాధానం చెబుతారు? కనీసం చివరి సంవత్సరంలోనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయించడానికి అవసరమైన నిధులను ఎలా సమకూర్చుకుంటారు?.... ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అవే సమస్యలుగా మారాయి. మరి ముఖ్యమంత్రి జగన్ వాటిని ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.!!