ఫైబర్ నెట్ స్కాం- కేంద్ర అధికారి అరెస్ట్ : టార్గెట్ లోకేశ్ టీం-19 మందిని గుర్తించిన సీఐడీ..!!
టీడీపీ హాయంలో చోటు చేసుకున్న ఫైబర్ నెట్ స్కాంలో తొలి అరెస్ట్ జరిగింది. టీడీపీ హాయంలో లోకేశ్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఫైబర్ నెట్ లో అక్రమాలకు పాల్పడ్డారనే అంశం పైన సీఐడి విచారించింది. అందులో దాదాపు రెండు వేల కోట్ల మేర అవినీతి జరిగిదంటూ ప్రస్తతు ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేసారు. దీంతో..విచారణ చేసిన సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చారు.
డిప్యుటేషన్ పైన ఏపీలో పని చేసిన సాంబశివరావు
మాజీ సీఎం చంద్రబాబు..మాజీ మంత్రి లోకేశ్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణప్రసాద్కు చెందిన టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ (టెరాసాఫ్ట్) సంస్థకు టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు అతిక్రమించా రని విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. దీంతో అయిదు రోజులుగా సీఐడీ అధికారులు ఇందులో కీలకంగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను విచారణ కు పిలిచారు. అందులో వేమూరి హరి ప్రసాద్ తో పాటుగా నాటి ప్రభుత్వం లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ- ఎండీగా పని చేసిన సాంబశివరావు హాజరయ్యారు.
ఫైబర్ నెట్ లో తొలి అరెస్ట్
అయితే, ఈ రోజు సాంబశివ రావును సీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన రాష్ట్రంలో పని చేసేందుకు డిప్యుటేషన్ మీద వచ్చారు. కేంద్ర రైల్వే సర్వీసులకు చెందిన సాంబశివరావు ఏపీలో డిప్యుటేషన్ మీద పని చేసారు. ఆ సమయంలో ఆయనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇక, సీఐడీ కోర్టులో ఆయన్ను హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. టెరా సాఫ్ట్ కోసం కంపెనీని బ్లాక్లిస్టు నుంచి హడావుడిగా తొలగించి.. ఫోర్జరీ పత్రాలు సృష్టించి.. టెక్నికల్ కమిటీలో అస్మదీయుడిని నియమించి.. నిపుణుల అభ్యంతరాలను బేఖాతర్ చేసి రూ.330 కోట్ల విలువైన ఫైబర్నెట్ టెండర్లను కట్టబెట్టేశారనే అంశం సీఐడి విచారణలో తేలింది.
గౌతం రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ విచారణ
దాదాపు రూ.2 వేల కోట్ల మేర సాగిన ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీఐడీ ఫైబర్ నెట్ టెండర్లలో అవినీతిని ఆధారసహితంగా బట్టబయలు చేసింది. మొదటి దశ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కేసులో వేమూరి హరికృష్ణప్రసాద్ (టీడీపీ ప్రభుత్వంలో ఇ-గవర్నెన్స్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు), కె.సాంబశివరావు (నాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ- ఎండీ) సహా మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ను న్యాయస్థానానికి సమర్పించింది.
ఉద్దేశ పూర్వకంగా చేసారంటూ అభియోగం
మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి మొదటి దశలో రూ.330 కోట్లకు ఫైబర్నెట్ కార్పొరేషన్ 2015లో ఇన్క్యాప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ) ద్వారా ఈ -టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు 2015 జూలై 31 వరకు గడువు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఒక్క రోజు ముందు అంటే జూలై 30న టెండర్ల దాఖలు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్లిస్ట్లో ఉన్న టెరా సాఫ్ట్ సంస్థ టెండర్ దాఖలు చేయకపోవడమే అందుకు కారణంగా గుర్తించారు.
మరిన్ని అరెస్టులు తప్పవంటూ..
ఫైబర్నెట్ కార్పొరేషన్కు టెరాసాఫ్ట్ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. టెండర్ నిబంధనలను పాటించకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేశారు. ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం, నాసిరకం, నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా బిల్లుల చెల్లింపు, నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల వల్ల ఫైబర్ నెట్ కార్పొరేషన్కు రూ.119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ విచారణలో నిగ్గు తేల్చింది. లోకేశ్ టీం ఇందులో బాధ్యులుగా చెబుతున్నారు. దీంతో..మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం కనిపిస్తోంది.