సీఐడీ అదుపులో టీడీపీ మాజీ మంత్రి - విచారణ: రాజధాని అమరావతిపై స్టేట్మెంట్..!!
అమరావతి: రాజధాని అమరావతి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు అంశం ఇప్పుడు తాజాగా తెరమీదికి వచ్చింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఏపీ సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు పీ నారాయణను ఆయన ఇంట్లోనే ప్రశ్నిస్తోన్నారు అధికారులు.
ఇందులో భాగంగా నారాయణ స్టేట్మెంట్ను నమోదు చేస్తోన్నారు. ఈ విచారణ కోసం ఈ ఉదయమే ఏపీ సీఐడీ అధికారులు గుంటూరు నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇంట్లోనే ప్రశ్నిస్తోన్నారు. నారాయణపై ఇంట్లో విచారణ జరపడానికి సీఐడీ అధికారులకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చిన మూడో రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఆయనకు అందజేసిన 160 సీఆర్పీసీ కింద ఈ విచారణ చేపట్టారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు- మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు పీ నారాయణ. ఈ కేసులో విచారణ రావాలంటూ ఇదివరకు అధికారులు ఆయనకు నోటీసులను జారీ చేశారు. దీనిపై ఆయన హైకోర్టులో సవాల్ చేశారు.
ఆయన దాఖలు చేసిన పిటీషన్పై రెండు రోజుల కిందటే తన నిర్ణయాన్ని వెల్లడించింది హైకోర్టు. ఆయనను విచారించడానికి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సీఐడీ కార్యాలయంలో కాకుండా హైదరాబాద్లోని ఇంటి వద్దే ఈ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది. నారాయణ ఆరోగ్యం, ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వెసలుబాటును కల్పించింది.
హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి రాకపోకలు సాగించలేరంటూ నారాయణ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తి పట్ల ఏపీ హైకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు పలు కీలక ప్రశ్నలకు నారాయణ నంచి సమాధానాలను రాబట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. దీని తరువాత వారు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.