అమరావతి భూ కుంభకోణం: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు: రెండు పేజీల కాపీ ఇదే..!
అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ.. దీనికి సంబంధించిన నోటీసులను అందజేసినట్లు సమాచారం. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ (సీఆర్పీసీ) కింద నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.
చంద్రబాబుకు నోటీసులను జారీ చేసిన విషయాన్ని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ధృవీకరించినట్లు తెలుస్తోంది. సీఐడీ విచారణకు హాజరు కావాలంటూ చంద్రబాబును సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ కేసు మరోసారి తెర మీదికి రావడం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు లేకపోలేదు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొత్తం ఆరుమంది ఏపీ సీఐడీ అధికారులు ఈ తెల్లవారు జామున చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి..వారి అనుమతితో లోపలికి వెళ్లారు. రాజధాని భూముల సమీకరణ సమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఆ కారణంతోనే నోటీసులను జారీ చేస్తున్నామని వారు చంద్రబాబుకు వివరించినట్లు చెబుతున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇదే కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు లేకపోలేదంటూ ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ పేరును సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలుస్తోంది.