ప్రతి 50కి.మీ లకు ఒక పోర్టు.. ఏపీని నెంబర్ వన్గా మారుస్తాం - సీఎం
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ లాజిస్టిక్స్ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన 'ఈస్ట్ కోస్ట్ మారీటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్'లో ఆయన పాల్గొన్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సులో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులతో.. స్వర్ణాంధ్ర - 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్గా మార్చే దిశగా చర్చలు జరిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజలందరి సహకారం అవసరమని కోరారు. ఆరు నెలల్లో మరోసారి విశాఖపట్నంలో ఇలాంటి సమ్మిట్ నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఈ సమ్మిట్లోనే ఎయిర్ కార్గో ఫోరం ఇండియా లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు.

దక్షిణాదిలో నెంబర్వన్ రాష్ట్రంగా ఏపీ..
భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్ లాజిస్టిక్స్ విస్తృతంగా అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు తెలిపారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం ఒక ప్రధాన ఆస్తి అని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ రంగంలో ఎయిర్ కార్గో, రైలు కనెక్టివిటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం 90 శాతం కార్గో బల్క్ రూపంలో రవాణా అవుతున్నప్పటికీ, ఎయిర్ కార్గో ద్వారా వేగంగా సరకు పంపిణీ చేయవచ్చని వివరించారు.
50కి.మీ లకు ఒక పోర్టు..
ప్రస్తుతం ఏపీలో ఆరు పోర్టులు ఉన్నాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని చంద్రబాబు వివరించారు. 2046 నాటికి అన్ని పోర్టులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేయడం లక్ష్యమని తెలిపారు. ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాల్లో ఏపీ ముందంజలో ఉందని, పోర్టుల ఆధారంగా ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రం టెక్నాలజీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇళ్లపైనే విద్యుదుత్పత్తి జరుగుతోందని, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరగడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. ఏఐ, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్లు, రోబోటిక్స్, ఐవోటీ, సెన్సార్స్ వినియోగం పెరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించామని, "వన్ ఫ్యామిలీ - వన్ ఆంట్రప్రెన్యూర్" లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
దేశంలో నదుల అనుసంధానం అత్యవసరమని చంద్రబాబు అన్నారు. గంగా నుంచి కావేరీ వరకు నదులను అనుసంధానం చేయడం ద్వారా నీటి భద్రత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. భారత్ షిప్బిల్డింగ్ రంగంలో వెనుకబడిందని అన్నారు. ఏపీలో మూడు, నాలుగు ప్రాంతాలను షిప్ నిర్మాణానికి కేటాయించామని చెప్పారు. ముందుకు వచ్చే సంస్థలతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధమని తెలిపారు. రాష్ట్రంలో డిఫెన్స్, మెరైన్ షిప్ బిల్డింగ్, కంటైనర్ టెర్మినల్స్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు.
మంచి ప్రతిపాదనలతో ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం వయబిలిటీ ఫండింగ్ ద్వారా మద్దతు ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. లాంగ్ టర్మ్ పార్టనర్స్ లాంగ్ టర్మ్ ప్లాంట్లతో రావాలని సూచించారు. విశాఖలో డేటా సెంటర్ రాబోతోందని, వైజాగ్ డేటా హబ్గా మారుతుందని చెప్పారు. అలాగే జీఎంఆర్ సంస్థ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుందని వివరించారు.












Click it and Unblock the Notifications