డబ్బులు కట్టకుండానే గ్యాస్ సిలెండర్లు ? చంద్రబాబు మరో గుడ్ న్యూస్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఉచిత సిలెండర్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం ఉద్దేశం వివరించడంతో పాటు లబ్దిదారులకు మేలు చేకూరేలా దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ప్రస్తుతం ఇది ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకమే అయినా ముందుగా డబ్బు చెల్లిస్తేనే సిలెండర్ బుక్ అవుతుంది. ఆ తర్వాత సబ్సిడీ రూపంలో డబ్బుల్ని 48 గంటల్లో లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీన్ని కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని చంద్రబాబు ఇవాళ వెల్లడించారు. దీంతో పాటు డబ్బులు ముందుగా కట్టకుండానే సిలెండర్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అదే జరిగితే లబ్దిదారులకు భారీ ఊరట కాబోతోంది.

ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం ఉద్దేశం నెరవేరాలంటే వాటిని పూర్తి ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దీపం పథకంలో లబ్దిదారులకే కాదు సాధారణ సిలెండర్లు కూడా పూర్తి మొత్తం చెల్లించి బుక్ చేసుకున్న తర్వాతే కేంద్రం ఇచ్చే సబ్సిడీని కస్టమర్ల ఖాతాల్లో వేస్తున్నారు. ఇప్పుడు ఉచిత సిలెండర్ల విషయంలో ఈ నిబంధన మినహాయించేలా కేంద్రాన్ని కోరాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications