పోలవరానికి కొత్త మెషినరీ రాక...పనులు ఇక చకచక...
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అతి కీలకంగా పరిణమించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత వేగంగా జరుగుతుందా అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో తాజా పరిణామాలు చంద్రబాబు ప్రభుత్వానికి ఊరట నిస్తున్నాయి.
Recommended Video

ఎపిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగపడే అతి ముఖ్యమైన యంత్రం తాజాగా పని ప్రారంభించింది. అత్యాధునికమైన ఈ యంత్రం వల్ల పోలవరం పనులు ఇక ఊపందుకునే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాఫర్ డ్యాం జెట్ గ్రౌటింగ్ పనులను సోమవారం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు సిఎం చంద్రబాబు అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడా ప్లాంటే పోలవరం పనులు చురుగ్గా సాగేందుకు తోడ్పడనుంది.

అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్... గురించి
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రారంభించిన అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్తో ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో వేగం పుంజుకోనుంది. ఇప్పటి వరకు రోజుకు 3 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తుండగా ఈ సామర్థ్యం సోమవారం నుంచి 5 వేల క్యూబిక్ మీటర్లకు పెరగనుంది.

ఎక్కడ నుంచి...ఎలా రప్పించారు...
పోలవరం నిర్మాణ పనుల కోసం ఆర్డర్ ఇచ్చిన అత్యాధునిక మెషినరీ ఎట్టకేలకు ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని తన పని ప్రారంభించేందుకు సిద్దంగా ఉండటంతో అటు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ..ఇటు ఎపి ప్రభుత్వానికి ఓ మోస్తరు ఊరట లభించింది. పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ రూ.25 కోట్లతో దుబాయి కేటీఐ కంపెనీకి చెందిన అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ ను తెప్పించింది. ఈ మెషినరీని అక్కడే బిగించి నిర్మాణం కోసం తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడ నుండి విడి భాగాలను తీసుకొచ్చి ప్రాజెక్టు క్షేత్రంలో బిగించారు.

ఇప్పటివరకు...ఇలా...
ఇప్పటి వరకు ఐస్ ముక్కలు ఉపయోగించి కాంక్రీట్ను 12 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తయారుచేసేవారు. దీనిని టెలీబెల్ట్ ద్వారా స్పిల్ వేకు 300 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి పంపేవారు. ఆ తర్వాత ఆ టెలీబెల్ట్ను అక్కడి నుంచి తొలగించి...300 మీటర్ల దూరం నుంచి మళ్లీ స్పిల్ వే వరకు అమర్చి కాంక్రీటును పోసేవారు...అలా టెలీబెల్ట్ను తొలగించి వేరే చోట బిగించేందుకు రెండు గంటల సమయం పట్టేది. పైగా ఈ కాంక్రీటును అరమీటర మందాన మాత్రమే పోసేవారు. అది చల్లారాక మళ్లీ 72 గంటలు పూర్తయ్యాక మాత్రమే దానిపై మరో అరమీటరు మందాన కాంక్రీటు వేసేందుకు ఇంతవరకు అవకాశం ఉండేది.

ఇప్పుడెలా...అంటే
ఇప్పుడు తాజాగా సమకూరిన అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ గంటకు 600 టన్నుల మెటల్ను కూలింగ్ చేసి...కాంక్రీట్ తయారు చేసే రెండు బ్లాచింగ్ ప్లాంట్లలోకి 300 టన్నుల చొప్పున నేరుగా సరఫరా చేస్తుంది. దీనిద్వారా తయారైన కాంక్రీట్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. అందుచేత ఒకేసారి మీటరు నుంచి మీటరున్నర మందంతో కాంక్రీట్ వేయవచ్చు. టెలీబెల్ట్ను కూడా తరచూ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో రెండు టెలీ బెల్టులు ఉంటాయి. కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత వేగంగా సాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications