నమ్మకం ముఖ్యం, మోడీని విశ్వసిస్తున్నా లేదంటే: బాబు షాకింగ్ కామెంట్స్
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు ఇరువురు అరగంట పాటు భేటీ అయ్యారు. విభజన హామీలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలతో కూడిన 17 పేజీల వినతిపత్రాన్ని ప్రధానికి అందించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.58వేల కోట్లతో సమర్పించిన పూర్తిస్థాయి అంచనాలను ఆమోదించడం, అమరావతి నిర్మాణం కోసం వచ్చే కేంద్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించడం, రాష్ట్రంలో శాసన సభ నియోజకవర్గాలను 175 నుంచి 225కు పెంచడం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ కంటే ఏపీ వెనుకబడి ఉంది
సేవా రంగంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందని చంద్రబాబు అన్నారు. ఈ రంగంలో ఏపీకి ఆదాయం తక్కువ అని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల సగటు ఆదాయంలో ఏపీకే తక్కువ అని చెప్పారు. సేవారంగంలో తక్కువ ఉన్నప్పుడు ఆదాయం తగ్గుతుందని చెప్పారు. సేవా రంగంలో తెలంగాణకు ఆదాయం ఎక్కువగా వస్తుందన్నారు. తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు కంటే వెనుకబడి ఉన్నామని చెప్పారు.
హేతుబద్ధద లేని విభజన వల్ల
హేతుబద్ధద లేని విభజన వల్లే ఏపీకి అన్నింటా ఇబ్బందులు అని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీలో ఇవ్వాల్సినవి అన్ని కూడా అడిగానని చెప్పారు. ఈఏపీ కింద ఇవ్వాల్సిన రూ.16వేల కోట్లు ఇప్పించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. రెవెన్యూ లోటు కింద కూడా 3900కు పైగా ఇచ్చారని, మిగతాది ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
రైల్వే జోన్ అంశం తేల్చాలని చెప్పాం
రైల్వే జోన్ అంశం త్వరగా తేల్చాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 54 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. 70 శాతం ఎర్త్ వర్త్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఏపీ ముందు ఉందని చెప్పారు. పారిశ్రామిక రంగంలోను ముందు ఉన్నామన్నారు. రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చారని, గుంటూరులో అభివృద్ధి పనులకు రూ.1000 కోట్లు ఇచ్చారని, మరిన్ని అడిగినట్లు చెప్పారు.
తెగతెంపులకు బాబు సిద్ధమా
విద్యాసంస్థలకు కావాల్సిన నిధులను బడ్టెట్లో పెట్టాలని కోరామని చంద్రబాబు చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, మరేదీ కాదని చెప్పారు. తద్వారా ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వకుంటే బీజేపీతో తెగతెంపులకు కూడా సిద్ధమని చంద్రబాబు అభిప్రాయంగా కనిపిస్తోంది. అన్ని అంశాలపై చేయగలిగినంత చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు. హోదా ద్వారా వచ్చే అన్ని అంశాలు ప్యాకేజీలో చేరుస్తామని అరుణ్ జైట్లీ చెప్పారని అన్నారు. ప్యాకేజీలో ఇవ్వాల్సినవి అన్నీ ఇవ్వాలని అడిగానని చెప్పారు. నియోజకవర్గాల పెంపు, కడప స్టీల్ ప్లాంటు తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.
నమ్మకమే ప్రధానం, మోడీని నమ్ముతున్నా, లేదంటే,
ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చంద్రబాబు చెప్పారు. నమ్మకమే దేనికైనా ప్రధానమని షాకింగ్ కామెంట్స్ చేశారు. అన్ని సమస్యలను ప్రధాని పరిష్కరిస్తారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు మించి తనకు ఏదీ లేదన్నారు. తాము ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నామని చెప్పారు. కాగా, చంద్రబాబు మాటలు చూస్తుంటే కేంద్రం నుంచి ఏపీకి ఆశించిన ప్రయోజనం లేకుంటే ఎన్డీయే నుంచి బయటకు వచ్చేలా మాట్లాడినట్లు భావిస్తున్నారు.