నిన్నటిదాకా పొగడ్తలు.. నేడు ఇలా!: ప్రియమైన మోడీ గారికి... ప్రధానికి చంద్రబాబు లేఖ పూర్తి పాఠం

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆదివారం (ఫిబ్రవరి 10వ తేదీ) ప్రధాని ఏపీ పర్యటన నేపథ్యంలో ఈ లేఖ రాశారు.

నాలుగేళ్ల పాటు ఎన్డీయేలో ఉండి, ఏపీకి మోడీ ప్రభుత్వం ఎన్నో ఇచ్చిందని, ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ ముద్దు అని, ఈ నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఏ రాష్ట్రానికి ఎవరూ ఇవ్వలేదని పదేపదే చెప్పిన చంద్రబాబు, టీడీపీ నేతలు ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్నందున టీడీపీ నేతలు మోడీని బద్నాం చేసే కుట్రకు తెరలేపారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఏపీకి వస్తున్నారు. ఈ సందర్భంగా లేఖ రాశారు.

నమ్మకద్రోహం చేసి ఏపీకి వస్తారా?

నమ్మకద్రోహం చేసి ఏపీకి వస్తారా?

ఏపీకి నమ్మకద్రోహం చేసి ఇప్పుడు తీరిగ్గా రాష్ట్రానికి ఎలా వస్తున్నారని మోడీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజల న్యాయమైన, చట్టపరమైన హక్కుల్ని నెరవేర్చకుండా మొండి చేతులతో రాష్ట్రానికి రావడం మీకు ధర్మమా, మీరు ఎన్నికల సమయంలో ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రధాని అయ్యాక మర్చిపోయారన్నారు. గత అయిదేళ్లుగా ఏపీకి మీరు, మీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అయిదు కోట్ల ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారని, ఏపీని హేతుబద్ధత లేకుండా విభజించడంలో బీజేపీ పాత్ర ఉందన్నారు. సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ఢిల్లీని మించిన రాజధాని నిర్మించేందుకు పూర్తి సహాయ సహకారాలందిస్తామని, విభజన చట్టంలోని అన్ని అంశాలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారని, అవి గుర్తున్నాయా అని ప్రశ్నించారు.

తుంగలో తొక్కారు

తుంగలో తొక్కారు

ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పి, నీరు, మట్టి ఇచ్చి వెళ్లారని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాల అమలు పట్ల మీరు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం తమ ప్రజల గుండెలను గాయపరిచిందన్నాు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ రాజ్యసభలో ప్రకటించిన రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా, ఇతర హామీలను తుంగలో తొక్కి మీరు చేసిన తీవ్ర అన్యాయం ఏపీ ప్రజల్ని ఆందోళనకు, కలతకు గురి చేసిందన్నారు. ప్రజల మనసుల్లో హోదా ఆకాంక్షను సాధించుకునేందుకు సంవత్సర కాలంగా ధర్మపోరాటాలు చేస్తున్నానని, మీరు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం బాధ్యతారాహిత్యం కాదా అన్నారు.

మీ చుట్టూ తిరిగాం

విభజన హామీల అమలు కోసం మీ వద్దకు, మీ మంత్రుల వద్దకు 29సార్లు వచ్చి విజ్ఞప్తి చేశానని, అది గుర్తుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. తన కేబినెట్ సహచరులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినప్పటికీ తమకు చట్టపరంగా, హక్కుగా రావలసిన అనేక ప్రయోజనాల్ని కక్షపూరితంగా రాకుండా చేయడం శోచనీయమన్నారు. హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అడ్డొస్తున్నాయని నమ్మించే ప్రయత్నాలు చేశారని, దాని స్థానంలో ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వడం లేదని చెప్పి, కొన్ని రాష్ట్రాలకు కొనసాగించడం ఏపీ ప్రజలను మోసం చేయడం కాదా అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, అమరావతికి నిధులు, కడప ఉక్కు కర్మాగారం తదితర అంశాల గురించి ప్రశ్నించారు. మోడీ ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తున్నారని, విభజన గాయం మీద కారం చల్లేందుకా లేక రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసి మభ్యపెట్టేందుకా అని చంద్రబాబు ట్వీట్ కూడా చేశారు.

చంద్రబాబు లేఖ పూర్తిపాఠం

చంద్రబాబు లేఖ పూర్తిపాఠం

ప్రియమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి,
నమస్కారములు.
మీరు ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్న సందర్భంగా 2014 ఎన్నికల సందర్భంలో మీరు చేసిన పలు వాగ్దానాలను, వాటి అమలు తీరును ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున మరోసారి గుర్తు చేస్తున్నాను. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు, మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా నిరసిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించడంలో భారతీయ జనతా పార్టీ ప్రముఖ పాత్ర వహించిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో మీరు ‘తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిన' కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ, తల్లీని, బిడ్డనూ కాపాడుతానని, సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాలుగా, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు తిరుపతి, నెల్లూరు, భీమవరం, మదనపల్లి, గుంటూరు సభలలో చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి.
అలాగే, అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంలో ఢిల్లీ కూడా చిన్నబోయే రాజధానిని నిర్మించేందుకు సహకరిస్తానని మీరిచ్చిన మాట మీకు గుర్తుందా.? అంతేకాకుండా విభజన చట్టంలోని అన్ని అంశాలను తు.చ. తప్పకుండా అమలుచేస్తానని చెప్పారు. అన్నివిధాలుగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పి ‘నీరు-మట్టి' ఇచ్చి వెళ్లారు.
దురదృష్టవశత్తూ, మీరు ప్రధానమంత్రి అయిన వెంటనే అంతకు ముందు చేసిన వాగ్దానాలన్నీ ‘గజనీ'లాగా మరచిపోవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన పలు అంశాల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం మా రాష్ట్ర ప్రజల గుండెలను గాయపరచింది. అంతేకాకుండా, ఆనాడు రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ ప్రకటించిన రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా, మరియు ఇతర హామీలను తుంగలో తొక్కి రాష్ట్రానికి మీరు చేసిన తీవ్ర అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు, కలతకు గురిచేసింది.
విభజన చట్టంలోని అంశాలను, అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలుపరచే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే మీ వద్దకు, మీ మంత్రుల వద్దకు 29 పర్యాయాలు నేను వచ్చి విజ్ఞప్తులు ఇచ్చిన విషయం మీకు అసలు గుర్తున్నదా.? హామీల అమలు చేయాలని కోరుతూ నేనూ, నా మంత్రిమండలి సహచరులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగినప్పటికీ మాకు చట్టపరంగా, హక్కుగా రావాల్సిన అనేక ప్రయోజనాలను కక్షపూరితంగా రాకుండా చేయడం శోచనీయం. ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రకటించాలని అనేకసార్లు కోరినప్పటికీ 14 వ ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డు వస్తున్నాయని నమ్మబలికి దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డురావని 14 వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యులు స్పష్టత ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ఆమోదం తరువాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని చెప్పి, ఆ తరువాత కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రాయితీను కొనసాగించడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేయడం కాదా? రాష్ట్ర ప్రజల మనసులో ప్రబలంగా ఉన్న ప్రత్యేక హోదా ఆకాంక్ష అమలు కోసం గత సంవత్సర కాలంగా ధర్మపోరాటాలు చేస్తున్నప్పటికీ, మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించడం బాధ్యతారాహిత్యం కాదా?
రాష్ట్రానికి జీవనాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టును యుపీఏ ప్రభుత్వ హయాంలోనే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, అన్ని అనుమతులూ వచ్చినట్టుగా భావించి అమలు చేస్తామన్నారు. నీతిఆయోగ్ కోరిన మీదట దాన్ని సత్వరమే పూర్తి చేసి సాగునీటి కోసం తపిస్తున్న జిల్లాలకు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని రాత్రింబవళ్లూ పనులు చేయిస్తున్నది. ఫలితంగా 64% పనులు ఇప్పటికే పూర్తి చేయగలిగాం. కానీ, సకాలంలో నిధులు విడుదల చేయకుండా, పోలవరం రివైజ్డ్ డీపీఆర్‌కు ఆమోదం తెలపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సుమారు రూ.4వేల కోట్ల నిధులను తిరిగి చెల్లించకుండా మాపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ప్రకటనను కావాలని వాయిదాల వేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కోరిన భూమి, గనులు, రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన్నప్పటికీ కడప ఉక్కు కర్మాగారం ఇంకా ఇవ్వలేదు.
కేవలం ఆరు మాసాలలో తొలిదశ పూర్తిచేయాలని విభజన చట్టంలో నిర్దేశించినప్పటికీ ఇప్పటికీ దుగరాజపట్నం పోర్టుపై ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. రాష్ర్టానికి రావాల్సిన జాతీయ సంస్థల విషయంలో కూడా మీరు అన్యాయమే చేశారు. పలు విద్యా సంస్థలను ఇచ్చినట్టే ఇచ్చి వాటికి సరైన నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఇలా అరకొర నిధులిస్తే అవి పూర్తిచేయడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందనే విషయం మీకు తెలియనిదా..? కాకినాడలో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ప్రారంభించాలని చట్టంలో ఉన్నప్పటికీ కుంటిసాకులతో నిరాకరించడం మా పట్ల మీ నిర్లక్ష్య ధోరణి కాదా?

ఇటువంటి అనేక అంశాలు, హామీల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని గ్రహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మేము ఈ రాష్ట్రం నుంచి పన్నులు కడుతున్నాం. మేము ఈ దేశంలో భాగం కాదా? కేవలం రూ.1500 కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించడం సాధ్యం అవుతుందా? నీతిఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ వెనుకబడిన ఏడు జిల్లాలకు గాను రాష్ట్ర ఖజానాకు జమచేసిన రూ.350 కోట్లను ఏకపక్షంగా, రాష్ట్ర అనుమతి లేకుండా తిరిగి వెనక్కి తీసుకోవడం భారత సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు కాదా?
మీరు ఈవిధంగా రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసి ఇప్పుడు తీరిగ్గా రావడం బాధాకరం. ఇంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఆందో. ళన, వారి మనోభావాలు, వారి ధర్మాగ్రహం గమనించండి. అన్నీ తెలిసీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన, చట్టపరమైన హక్కులను నెరవేర్చకుండా మొండిచేతులతో రావడం మీకు ధర్మమా?
కనుక, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా గుర్తించి, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా హామీని, ఇతర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని అన్ని అంశాలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాను.
ఇట్లు
భవదీయుడు
(నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+