చంద్రబాబు స్మార్ట్ ప్లాన్: 18 కి.మీ. పాదయాత్ర
హైదరాబాద్: గ్రామాల్లోని పేదలకు అభివృద్ధి ఫలాలు అందకుండా స్మార్ట్ ప్రపంచాన్ని రూపొందిస్తామని కబుర్లు చెబితే అర్థం ఉండదని, ప్రతి గ్రామంలో ప్రతి వారికి ఇల్లు, మరుగుదొడ్డి, రక్షిత మంచినీటి సదుపాయం ఉండాలని, నూటికి నూరు శాతం పిల్లలు పాఠశాలలకు వెళ్లాలని, అందరికీ జీవనోపాధి లభించాలని, ఇటువంటి ఇరవై అంశాలను లక్ష్యాలుగా ఎంచుకొని వాటి సాధనకు స్మార్ట్ విలేజి స్మార్ట్ వార్డు పథకం చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
పల్లె సీమల్లో ప్రగతి సుమాలు విరియడానికి చేపడుతున్న స్మార్ట్ ఉద్యమం ఇదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డు పథకాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతి నివాసిత ప్రాంతం ఆరోగ్యవంతమైన ఆనంద నందనంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్నారు.
కొన్ని లక్ష్యాల సాధనకు ప్రభుత్వపరంగా ఇచ్చే నిధులు ఉంటాయని, మరి కొన్ని లక్ష్యాల సాధనకు భాగస్వాములే సొంతంగా నిధులు సమీకరించి ప్రభుత్వం ఇచ్చే నిధులకు వాటిని జతచేసి వినియోగించాలన్నారు. జీవితంలో ఉన్నత స్ధానాలకు ఎదిగిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తమ గ్రామాల నుంచి బయటకు వచ్చి స్ధిరపడిన వారు ఒక ప్రాంతంపై దృష్టి పెట్టి పని చేస్తే ఇవి సాధించడం సాధ్యమన్నారు.

వచ్చే అరవై రోజుల్లో ఈ కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేసి వీలైనంతమందిని ఇందులో భాగస్వాములుగా చేరుస్తామన్నారు. రాజకీయాలకతీతంగా అందరితో సమావేశమై అందరి భాగస్వామ్యాన్ని ఆర్థిస్థానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పదహారు వేల నివాసిత ప్రాంతాలు ఉన్నాయని, వాటికి 16వేల మంది భాగస్వాములను సమీకరించడం పెద్ద కష్టంగా తాను భావించడం లేదని తెలిపారు.
ఒక గ్రామానికి ఒకరికి మించి ముందుకు వస్తే వారిలో ఒకరిని ప్రధాన భాగస్వామిగా పెట్టి మిగిలిన వారిని భాగస్వాములుగా చేరుస్తామన్నారు. ఏటా సంక్రాంతి పండగ సమయంలో ఈ నివాసిత ప్రాంతాలపై సర్వే నిర్వహించి సాధించిన ఫలితాల ఆధారంగా మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయులో అవార్డులు అందచేస్తామని తెలిపారు.
భాగస్వాములుగా చేరేవారు గ్రామాలు, వార్డులను ఎంపిక చేసుకోవడానికి వీలుగా వాటన్నింటికి సంబంధించి వివిధ అంశాల్లో ప్రస్తుత స్ధితిగతులు వివరిస్తూ ఒక వెబ్సైట్ రూపొందించామని, దానిని ఆదివారం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. భాగస్వాములుగా చేరేవారు ఈ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకునే వీలుందన్నారు.
కాగా, విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఒక ఫొటోగ్రాఫర్తో చంద్రబాబు అప్పటికప్పుడు ఆయన స్వగ్రామం భాగస్వామిగా ఈ వెబ్ సైట్ ద్వారా నమోదు చేయించారు. ఈ పథకానికి ప్రత్యేకంగా తామేమీ నిధులు ఇవ్వబోమని, ఉన్న పథకాల్లోని నిధులనే దీనికి సమన్వయం చేస్తామన్నారు.
ఇది ప్రగతి కోసం చేపట్టిన ప్రజా ఉద్యమమని, ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్ దిశగా అడుగులు వేస్తున్నందువల్ల దీనికి స్మార్ట్ విలేజి స్మార్ట్ వార్డ్ అని నామకరణం చేశామన్నారు. గత ఎన్నికల్లో తనను ఎక్కువ ఆదరించిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తాను దీనిని ప్రారంభిస్తున్నానన్నారు. స్మార్ట్ ఉద్యమంలో భాగంగా చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.












Click it and Unblock the Notifications