సమన్వయం ఒక స్వోత్కర్ష: ఎమ్మెల్యేలూ మంత్రుల్లో అనిశ్చితి.. ఇదీ బాబు స్టైల్
‘మంచి చేస్తే నా వాటా.. చెడు అంటే మీ వాటా’ అనే నానుడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు తప్పక వర్తిస్తుంది.
అమరావతి: 'మంచి చేస్తే నా వాటా.. చెడు అంటే మీ వాటా' అనే నానుడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు తప్పక వర్తిస్తుంది. 1995 నుంచి 2004 వరకూ పాలనా కాలంలోనూ ఇదే వరుస.
తానే రాష్ట్రప్రగతికి కష్టపడుతున్నానని, తనతో పోటీ పడి ముందుకు దూసుకెళ్లలేకపోతున్నారని జన్మభూమి, రోజువారీ సమీక్షలతో అధికార యంత్రాంగాన్ని హడలెత్తించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులను పరుగులెత్తించారు. ఇప్పుడూ అదే పని చేస్తున్నారు చంద్రబాబు. తానొక్కడినే కష్టపడుతున్నానని స్వోత్కర్షలు మొదలు పెట్టారు.
అధికారానికి దూరంగా ఉన్నన్ని రోజులు 'నేను మారాను.. మీ కోసం' అంటూ నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బాటలోనే ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యేలు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారని, ఎన్నికల వేళ అన్నీ లెక్కలు బయటకు తీస్తామని వారిలో అనిశ్చితి కలిగించడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తెలుగు తమ్ముళ్లలో అనిశ్చితి పెంపకం వ్యూహం ఇలా
చెడ్డపేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోకపోతే వారిని వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టడానికి తాను వెనుకాడబోనని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు. ఎవరేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను. ఇంత చాకిరీ చేస్తూ కూడా అలాంటి వారి వల్ల నేను మాట పడాల్సి వస్తోంది. జన్మభూమి కమిటీల సభ్యుల నుంచి ఎమ్మెల్యేల వరకూ నాది ఒకటే హెచ్చరిక.
అవినీతికి పాల్పడితే వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. వారికి మరోసారి అవకాశాలు రావు. వారి తప్పులకు పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. నేను మెత్తగా ఉంటున్నానని అనుకోవద్దు. టికెట్లు ఇచ్చేటప్పుడు ప్రతి అంశం లెక్కకు వస్తుంది‘ అని హెచ్చరించారు. తన నివాసంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతల సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గతంతో పోలిస్తే సీఎం చంద్రబాబు స్వరంలో కరుకుదనం పెరిగిందని తెలుగుతమ్ముళ్లు గుర్తించారని సమాచారం అందడం గమనార్హం.
సీ గ్రేడంటే వదిలించుకోవడమేనా?
ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ గ్రేడింగ్ ఇస్తున్నామని, బీ గ్రేడ్లో ఉన్నవారు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి కౌన్సెలింగ్ ఇస్తామని, సీ గ్రేడ్లోనే ఉన్నవారిని పక్కన పెట్టడం తప్ప మరో మార్గాంతరం లేదని తేల్చిచెప్పారు. సమస్యల్లోని తీవ్రతను, సున్నితత్వాన్ని గుర్తించడంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇంకా తడబడుతున్నారని, దీనివల్ల సమస్యలు పెరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘గరగపర్రు ఘటన ఇంత దూరం రాకూడదు.
ప్రారంభంలోనే పట్టించుకుని ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. స్థానిక ఎమ్మెల్యే శివరామరాజు సమస్యను తేలిగ్గా తీసుకోవడం... వేగంగా కదలకపోవడం వల్ల అది పెద్ద సమస్యగా మారిపోయింది. చాపరాయిలో గిరిజనుల మరణాలపై కూడా వైద్య శాఖ ముందే స్పందించి ఉండాల్సింది. నా దాకా వస్తేనే సమస్యలు పరిష్కారం కావాలా? మీ స్థాయిలో మీరు చేయలేరా‘ అని ఆయన మంత్రులను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లోని, కొండల్లోని గూడేలకు రోడ్లు వేయాలా? అని వెటకారం చేశారు. మలేరియా వంటి వ్యాధులతో ప్రజలెవరూ చనిపోలేదన్నారు.
మంత్రి అయ్యన్నపై పరోక్ష ఆగ్రహం
గుంటూరు ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ జిల్లా ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ పత్రికలకు ఎక్కడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు. ‘ఇన్చార్జి మంత్రి సమావేశం ఏర్పాటుచేస్తే ఎమ్మెల్యేలంతా రావాలి. ఏదైనా వేరే సమావేశం ఉంటే ముందే మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాలి. వాళ్లు రాలేదని మంత్రి అలిగి.. ఆ కోపాన్ని మీడియా ముందు చూపితే ఎలా? నేను చేస్తున్న శ్రమంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నేను ఇటుక ఇటుకా పేర్చుకుని వస్తుంటే మీరు కూలగొట్టుకుంటూ వస్తున్నారు' అని విరుచుకుపడ్డారు. మంత్రి అంటే తమకు గౌరవముందని, సమాచార లోపం వల్లే ఆ సమస్య వచ్చిందని... ఇకపై అలా జరక్కుండా చూసుకుంటామని జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వివరణ ఇచ్చారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఇన్చార్జులుగా నియమితులైన మంత్రులు.. తమకు కేటాయించిన ప్రాంతంలో నెలకు కనీసం వారం రోజులు పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు.
మంత్రులు పోస్ట్ మ్యాన్లు కారాదని వ్యాఖ్యలు
వారంపాటు జిల్లా ఇన్చార్జి మంత్రులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగిందీ లేనిదీ పర్యవేక్షించాలని ఆయన రాష్ట్ర కార్యాలయ బాధ్యులను ఆదేశించారు. ‘మీకు కేటాయించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై లోతుగా పరిశీలన చేయండి. బలహీన స్థానాలు ఏమిటో గుర్తించండి' అని స్పష్టం చేశారు. ‘గ్రామ స్థాయి వరకూ సమస్యలపై అవగాహన చేసుకుని రండి. మీరు సిద్ధంగా ఉన్నామంటే సమీక్షలు మొదలుపెడతాను. ప్రతి మంత్రికీ అనుబంధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు నిర్వహణ కార్యదర్శుల బృందాన్ని నియమిస్తున్నాం. అందరూ కలిసి పనిచేయాలి' అని సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు అడిగిన అంశానికి వివరణ ఇస్తూ.. ఇన్చార్జి మంత్రులు పోస్ట్మ్యాన్ ఉద్యోగం చేయకూడదని, కొన్ని సమస్యలను తమ స్థాయిలో పరిష్కరించాలని, అలా కానివాటిని మాత్రమే తన వద్దకు తేవాలని సూచించారు. ‘నాయకత్వం ఇచ్చేవాళ్లు నాకు కావాలి. బాధ్యత తీసుకుని పని చేయాలి. ఫలితం చూపాలి. వెళ్లాం.. వచ్చాం అన్నట్లుగా ఉండేవారు నాకు వద్దు' అని చంద్రబాబు తెగేసి చెప్పారు.
ఉప ఎన్నికల్లో ఆ సంప్రదాయం కొనసాగించాలి
సిటింగ్ ప్రజాప్రతినిధులు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఆ సీటును ఏకగ్రీవంగా వదిలిపెట్టాలన్న పాత సంప్రదాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తే బాగుంటుందని టీడీపీ అభిప్రాయపడింది. సమన్వయ కమిటీ భేటీలో నంద్యాల ఉప ఎన్నికపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. నంద్యాలలో ఏకగ్రీవానికి మద్దతివ్వాలని వైసీపీని కోరితే బాగుంటుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేశాక అడగడం అనవసరమని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే - మాజీ మంత్రి శిల్పా మోహన రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది.
నంద్యాలలో గెలుపుపై చంద్రబాబు దీమా
ఉప ఎన్నికల్లో పోటీ విషయమై ‘అడగకపోతే మీరు అడిగి ఉంటే ఇచ్చేవాళ్లమని అంటారు. అడిగితే మా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎలా సహకరిస్తాం' అని అంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగ్యానాయక్ హత్య నుంచి ఈ సంప్రదాయం మొదలైంది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తే ఆ సీట్లో మనం పోటీ పెట్టలేదు. వైఎస్ చనిపోయినప్పుడు పులివెందులలో పోటీ పెట్టలేదు. శోభానాగిరెడ్డి చనిపోయినప్పుడు ఆళ్లగడ్డలో పోటీ చేయలేదు. ఈ సమావేశంలో మన అభిప్రాయం వ్యక్తం చేద్దాం. తర్వాత వారిష్టం‘ అని సీఎం తెలిపారు. ఎన్నిక జరిగినా తేలిగ్గా గెలుపొందగలమని చెప్పారు. అయితే ఇంకా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కాలేదు.
‘ఇంటింటికి టీడీపీ' పేరిట ఇలా..
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అరవై రోజులపాటు ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ప్రజా సంబంధ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ నెల 20నాటికి అన్ని నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని, అదే సమయానికి మొత్తం పెండింగ్ కమిటీలు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో కార్యకర్తల మద్దతు లేదని వెల్లడైన వారికి కూడా పార్టీ పదవులు ఇవ్వాలని నేతలు ఒత్తిడి తెస్తున్నారని, ఇదేం పద్ధతి అని నిలదీశారు. ‘మీరు అడుగుతున్నారు కాబట్టి 3 నెలల టైమిస్తున్నాను. తర్వాత మరోసారి ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తాను. ఈలోపు ప్రజల ఆమోదం తెచ్చుకుంటే సరే. లేకపోతే వారికి అవకాశం ఇవ్వం‘ అని చంద్రబాబు స్పష్టం చేశారు.