రాజధాని రగడ: రంగంలోకి బాబు, గ్రామానికి ఐదుగురు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూసేకరణలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబు ఎల్లుండి (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి పత్తిపాటి ఆదివారం చంద్రబాబును కలిశారు. తుళ్లూరు మండలంలోని పరిస్థితిని సీఎంకు వివరించారు. రాజధానికి భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్న వారిని కూడా రెచ్చగొడుతున్నారని ఆయన సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
రైతులతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి చంద్రబాబు ముఖాముఖీగా మాట్లాడనున్నారు. గ్రామానికి ఐదుగురు చొప్పున రైతులతో భేటీ కానున్నారు.
అంతకుముందు చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ... ఆగ్నేయ ఆసియా దేశాలు గత 50 ఏళ్లలో మంచి అభివృద్ధిని సాధించాయన్నారు. దీనికి మంచి పరిపాలన, చక్కని ప్రణాళికలే కారణమని బాబు చెప్పారు. మనకు వనరులు ఉన్నా అభివృద్ధి చెందలేకపోయామన్నారు.
నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. సింగపూర్ మంత్రులు అంతా ఆంధ్రప్రదేశ్పై సానుకూలంగా ఉన్నారని, రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని వారిని కోరినట్లు చంద్రబాబు తెలిపారు.
తుళ్లూరు రైతులతో ఎల్లుండి సమావేశం అవుతామని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి రైతులు సహకరిస్తున్నారని, అక్కడ రాజధాని వద్దన్నవాళ్లే గొడవ చేస్తున్నారన్నారు. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టామని, కొందరు అక్కడి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
భూసేకరణలో ఎవరికీ అన్యాయం జనగనివ్వమని ఆయన హామీ ఇచ్చారు. భూ సేకరణ ద్వారా అక్కడి రైతులకే లాభం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. భూసేకరణ,. భూ సమీకరణకు చాలా తేడా ఉందన్నారు. రాజధాని పరిధిలో ప్రస్తుతం 25 లక్షల జనాభా ఉన్నారని, వచ్చే ఐదేళ్లలో 50లక్షలకు చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకోవాలన్నారు.