ఏపీ సీఎం ఓ మహిళ- మళ్లీ తడబడిన వైఎస్ జగన్- ఆడుకుంటున్న నెటిజన్లు
కరోనా నేపథ్యంలో గతేడాది నుంచి ఎక్కువగా బహిరంగ సమావేశాలకు హాజరుకాని ఏపీ సీఎం వైఎస్ జగన్.. తన క్యాంపు కార్యాలయం నుంచే పదుల సంఖ్యలో పధకాల ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత విజయవాడ శివారు గొల్లపూడిలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ .. యాప్ గురించి వివరిస్తూ తడబడ్డారు.
దిశ యాప్ గురించి వివరిస్తూ ఏపీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా సీఎం జగన్ గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఏపీకి సాక్షాత్తూ ఓ మహిళ సీఎం కాబట్టి అన్నారు. దీంతో అక్కడున్న వారంతా జగన్ వ్యాఖ్యలకు అవాక్కయ్యారు. సీఎం తానై ఉండి ఓ మహిళ సీఎం అని జగన్ చెప్పడంపై వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతలోనే పక్కనే ఉన్న అధికారులు హోంమంత్రి అనడంతో జగన్ తేరుకుని వెంటనే హోంమంత్రి అంటూ చెప్పి తన ప్రసంగం కొనసాగించారు.
ఏమి మాట్లాడుతున్నారు సార్? 😳 pic.twitter.com/OijYSnCkw0
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) June 29, 2021
గతంలోనూ పలు సందర్భాల్లో సీఎం జగన్ తన ప్రెస్ మీట్లు, సమావేశాల సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో పోరబాట్లు దొర్లాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా ఆయన బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం లేదు. కరోనాతో పూర్తిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు. గతంలో జగన్ తడబడినప్పుడు ఆయన వీడియో క్లిప్స్ ను టీడీపీతో పాటు విపక్ష పార్టీలు ట్రోల్ చేసేవి.
ఇప్పుడు మరోసారి జగన్ హోంమంత్రికి బదులు మహిళ ముఖ్యమంత్రి అంటూ చేసిన వ్యాఖ్యల్ని సైతం విపక్ష పార్టీలు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ఇలాగే తడబడుతూ వ్యాఖ్యలు చేసినప్పుడు వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసేది ఇప్పుడు జగన్ వ్యాఖ్యల్ని వారు అదే స్ధాయిలో ట్రోల్ చేస్తున్నారు.