కేసీఆర్తో వైఎస్ జగన్ ఫేస్ టు ఫేస్కు రెడీ: జనం సెంటిమెంట్ను రెచ్చగొట్టలేం: ఏపీ మంత్రి
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు మరోసారి పీక్స్కు చేరుకునే పరిస్థితులు కనిపిస్తోన్నాయి. జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ మధ్య వాతావరణాన్ని వేడెక్కిస్తోన్నాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నట్లుగా భావిస్తోన్న సత్సంబంధాలను తీవ్రంగా ప్రభావం చేసేలా మారాయి. మొన్నటికి మొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం తగ్గకముందే- తాజాగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతోన్నాయి.
ఈ పరిస్థితులపై ఇటు ఏపీ మంత్రులు కూడా స్పందిస్తోన్నారు. తాజాగా- సమాచార, ప్రజా రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బదులు ఇచ్చారు. జల వివాదాలను అడ్డుగా పెట్టుకుని వైఎస్సార్ను విమర్శించడం సరికాదని చెప్పారు. సమస్యను మరింత పెద్దది చేసుకోవడం, సెంటిమెంట్ను రెచ్చగొట్టడం వంటి చర్యలకు తాము పూనుకోవట్లేదని అన్నారు. అంశాలపరంగా చర్చించడానికే ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు. వైఎస్సార్ను తిట్టడం వల్ల జల వివాదాలు పరిష్కారం కావని, సమస్యను మరింత క్లిష్టతరం చేస్తాయని అన్నారు.
రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతలు, మంత్రులు వైఎస్సార్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ మంత్రులు తమ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం వైఎస్సార్ ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టారనేది ఆ రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరికీ తెలుసని, అందుకే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న 2009 నాటి ఎన్నికల్లోనూ వైఎస్సార్ నాయకత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. కృష్ణానది నుంచి తాము అదనపు నీటిని మాత్రమే వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోన్నామని చెప్పారు.

తెలంగాణకు కేటాయించిన కృష్ణా జలాల నుంచి గ్లాస్ నీటిని కూడా అదనంగా తీసుకోవట్లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి కేటాయింపుల్లో ఏపీ వాటా నుంచి రాయలసీమ జిల్లాలకు మళ్లించడానికే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రతిపాదించామని అన్నారు. జలాల వినియోగంపై సందేహాలు ఉంటే చర్చించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని స్పష్టం చేశారు. నీటి వివాదాలపై తెలంగాణ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని, అది సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుందని , భావోద్వేగాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశం తమకు లేదని పేర్ని నాని అన్నారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతతో ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications