అమిత్ షా ఆహ్వానం- ఢిల్లీకి సీఎం జగన్ : కేసీఆర్ సైతం రాజధానిలో - ఏం జరుగుతోంది..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. శనివారం మధ్నాహ్నం సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కొంత కాలంగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం కావాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే, ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఈ నెల 26న సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరు అవుతారా లేదా అనే అంశం పైన చర్చ సాగుతోంది. అయితే, సీఎం..డీజీపీ ఈ సమావేశానికి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అమిత్ షా తో సీఎం జగన్ సమావేశం
అయితే, ఈ సమావేశానికి ముందుగానే హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ సమావేశం కానున్నట్లుగా సమాచారం. శనివారం రాత్రి లేదా ఆదివారం సాయంత్రం వీరిద్దరి సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనలోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తోనూ సీఎం భేటీ కానున్నారు. ఇప్పటికే పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం అంశం పైన ఎంతో కాలంగా అడుగుతున్నా..ఆమోదం ఇవ్వలేదు. దీంతో పాటుగా కొత్త ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ అభ్యంతరాలు..తాజాగా కేంద్రం జారీ చేసిన బోర్డుల నోటిఫికేషన్ల పైన తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో సీఎం జగన్ సమావేశం కీలకంగా మారుతోంది.
కేంద్ర మంత్రులతో జగన్ భేటీ
ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సీఎం జగన్ భేటీ అవుతారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్దిక పరిస్థితులపైన చర్చించనున్నారు. ఇక, అమిత్ షా తో వ్యక్తిగతంగా భేటీ అయిన సమయంలో రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూనే. .రాజకీయ అంశాల పైనా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఆర్దికంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి..కేంద్రం నుంచి మరింత తోడ్పాటును సీఎం కోరే అవకాశం ఉంది. అయితే, ఇదే సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటున్నారు.
కేసీఆర్ సైతం ఢిల్లీ యాత్ర
ఇదే నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ వారం రోజుల పాటు అక్కడే మకావ వేసారు. ప్రధాని మోదీతో పాటుగా అమిత్ షా, షెకావత్ తో భేటీ అయ్యారు. ఏపీలో సీఎం జగన్ గెలిచిన తరువాత ఇద్దరు సీఎంలు సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. కానీ, ఆ తరువాత ఇద్దరి మధ్య సమావేశాలు జరగలేదు. ఇక, నీటి వివాదాల విషయంలో రెండు రాష్ట్రాలకు చెందిన నేతల మధ్య మాటల యుద్దం సాగింది. నేరుగా జగన్..దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ లక్ష్యంగా తెలంగాణ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ఇద్దరు సీఎంలు కలుస్తారా..చర్చలు చేస్తారా
దీంతో..ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. అదే విధంగా ఇద్దరు సీఎంలూ కేంద్ర జలశక్తి మంత్రి తో భేటీ కానున్నారు. ఇద్దరు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీంతో..ఇద్దరు సీఎంలో ఢిల్లీలో ఒకే వేదిక మీదకు వస్తున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరణామం ఆసక్తి కరంగా మారుతోంది. ఇరు రాష్ట్రాల వాదనలు విని..పరిష్కరించేందుకు ఢిల్లీ కేంద్రంగా త్వరలో అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల ఢిల్లీ యాత్రలో ఈ అంశం పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.