సీజేఐకు సీఎం జగన్ తేనేటి విందు- హాజరైన సుప్రీం..హైకోర్టు న్యాయమూర్తులు : ఒకే వేదికపైకి...!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ తేనేటి విందు ఇచ్చారు. మూడు రోజుల పర్యటన కోసం ఏపీకి వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్దం ఏపీ ప్రభుత్వ అధినేత సీఎం ఈ విందు ఏర్పాటు చేసారు. కడపలో మూడు రోజుల పర్యటన కోసం వెళ్లిన సీఎం జగన్ ఈ మధ్నాహ్నమే తన పర్యటన ముగించుకొని విజయవాడకు తిరగి వచ్చారు. సతీమణి భారతితో కలిసి నేరుగా సీజేఐ ఎన్వీ రమణ బస చేసిన హోటల్ కు వెళ్లారు. అక్కడ సీజేఐ దంపతులతో సీఎం దంపతులు సమావేశమయ్యారు.
సీజేఐకు సీఎం జగన్ తేనేటి విందు
తాము ఏర్పాటు చేస్తున్న తేనేటి విందుకు రావాలని తన మాటగా ఆహ్వానించారు. ఇక, విజయవాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ తేనేటి విందుకు సీజేఐ దంపతులు చేరుకోగానే వారికి సీఎం దంపతులు స్వాగతం పలికారు. వారితో పాటుగా పలువురు సుప్రీం..తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ముందుగా సీజేఐ కేక్ కట్ చేసారు. సీఎం జగన్ అందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రసంగించారు. సీజేఐ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు.
సీజేఐను సత్కరించిన సీఎం జగన్
ఆ తరువాత తన కేబినెట్ లోని మంత్రులను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం జగన్ పరిచయం చేసారు. సీజేఐతో సహా..సుప్రీం న్యాయమూర్తులు..తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను సీఎం జగన్ సత్కరించారు. సీఎం సతీమణి భారతి న్యాయమూర్తుల సతీమణులతో కలిసి హై టీలో పాల్గొన్నారు. తరువాత సీజేఐ ఎన్వీ రమణ..సీఎం జగన్ ప్రతీ న్యాయమూర్తి..అతిధుల వద్దకు వెళ్లి పలకరించారు. సీజేఐను శాలువాతో పాటుగా శ్రీవేంకటేశ్వరుని ప్రతిమ ఇచ్చి సీఎం సత్కరించారు.
ఆసక్తి కరంగా - ఆహ్లాదకరంగా
ఆ తరువాత సీజేఐ విజయవాడ రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన పౌర సన్మానంలో పాల్గొనేందుకు వెళ్లారు. కాగా, సీఎం జగన్.. సీజేఐ కు తేనేటి విందు ఇవ్వటం.. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయటం.. కలిసి ప్రాంగణం అంతా కలియ తిరగటం.. వంటి సన్నివేశాలు ఆసక్తి కరంగా మారాయి. సీజేఐ..సీఎం కలిసి పాల్గొన్న కార్యక్రమం కావటంతో ఇప్పుడు ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.