కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి : శిబిరాలకు బాధితులు-ఎస్డీఆర్ఎఫ్ సిద్దం : భారీ వర్షాలపై సీఎం జగన్..!!
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ముందస్తు చర్యల పై ఆరా తీసారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని... తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారని సీఎం కలెక్టర్లను అలర్ట్ చేసారు.

ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని... ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ..నిర్ణయాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయని చెప్పారు. రెండు బృందాలు ఇప్పటికే నెల్లూరు, మరో రెండు బృందాలు చిత్తూరు చేరుకున్నాయని వివరించారు. కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని సీఎం స్పష్టం చేసారు.

శిబిరాల్లో వారికి అన్ని సదుపాయాలు కల్పించండి
సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోవాలన్నారు. వారికి మంచి ఆహారం అందించడంతో పాటుగా.. బాధితులకు వేయి రూపాయల చొప్పున అందించాలని ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధితులకోసం హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పటికే తిరుపతిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులో వీస్తున్నాయి. తిరుమల ఘట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అదే విధంగా, పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి.

నెల్లూరు - చిత్తూరు జిల్లాలపై అధిక ప్రభావం
13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. అంతకు ముందు 2008 నవంబర్ 13న నెల్లూరు వద్ద తుపాను తీరాన్ని దాటింది. వాతావరణశాఖ తెలిపిన మేరకు.. గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శుక్రవారం నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల అతితీవ్రమైన భారీవర్షాలు, గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

కోస్తా జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. న్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications