కడపకు సీఎం జగన్.. బర్త్ డే విషెస్ కూడా చెప్పని చెల్లెలు.. క్రిస్మస్ వేడుకల్లో కలవబోతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపలో గురువారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 25న పులివెందుల ఈఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి జగన్ పాల్గొననున్నారు. అయితే ఈ క్రిస్మస్ వేడుకల్లో అన్నా చెల్లెలు కలవబోతున్నారా.. ? అభిమానులు ఏం కోరుకుంటున్నారు..?

తొలి రోజు జగన్ బిజీ షెడ్యూల్
ఏపీ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం 9.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి.. బహిరంగ సభలో పాల్గొంటారు . అనంతరం బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీ-1కు చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో సీఎం కాసేపు ముచ్చటిస్తారు. అనంతరం బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత మెజర్స్ సెంచురీ ఫ్లై పరిశ్రమకు జగన్ శంకుస్థాపన చేస్తారు . మధ్యాహ్నం కొప్పర్తి గ్రామంలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్హౌస్కు చేరుకుని రాత్రి అక్కడే జగన్ బస చేస్తారు

ఆదిత్య బిర్లా యూనిట్కు శంకుస్థాపన
ఈనెల 24న ఉదయం 9.00 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్కు సీఎం జగన్ చేరుకుంటారు . దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్థనలలో పాల్గొంటారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ, బహిరంగసభలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు.

క్రిస్మస్ వేడుకలకు షర్మిలా వస్తారా..?
25వ తేదీన క్రిస్మస్ పండుక సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ప్రతి ఏటా వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. అయితే గత కొంత కాలంగా జగన్కి తన చెల్లెలు, తెలంగాణ వైస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య పలకరింపులు లేవు. కలిసింది లేదు.

అన్నకు బర్త్ డే విషెస్ చెప్పని చెల్లెలు
అయితే మంగళవారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు మొదలు సినీ ప్రముఖుల వరకు సీఎంకు బర్త్ డే విషెస్ తెలిపారు. కానీ తన చెల్లెలు షర్మిలా మాత్రం విషెస్ చెప్ప లేదు. మరి ఇంత గ్యాప్ మధ్య.. పులివెందులకు షర్మిలా వస్తారా..? రారా ..? వస్తే అన్న జగన్ తో కులుస్తారా.. పలకరింపులు ఉంటాయా.. ఉండవా..? అన్న అనుమానాలు వైఎస్ అభిమానుల్లో నెలకొన్నాయి.. అన్నా చెల్లెలు కలవాలని అభిమానులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.. మరి ఈనెల 25న పులివెందులలో ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications