18న ఢిల్లీకి సీఎం జగన్.. మోడీ షాలతో భేటీ, నిర్ణయం మారుతుందా..?
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 18న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 20న మూడు రాజధానుల అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆమోదం పొందేలా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రాజధానులు అమరావతి నుంచి పరిపాలన రాజధాని తరలింపు ప్రతిపాదనను వైసీపీ మినహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
అమరావతి గ్రామాల్లో నెలరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఏపీ బీజేపీ శాఖ సైతం అమరావతికి మద్దతుగా తీర్మానం చేసింది. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో సమావేశం అయ్యారు. ఏపీలో రాజధానితో సహా అన్ని అంశాల్లో బీజేపీ జనసేన కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించాయి.

ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకొచ్చిన పరిస్థితుల్లో సైతం జగన్ రాజధాని విషయంలో ముందుకే వెళ్లాలని భావిస్తున్నారు. జాతీయ మీడియా మొదలు ప్రతిపక్షాల వరకు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతుండటంతో తన ఆలోచనల వెనక ఉద్దేశాలను నేరుగా ప్రధాని కేంద్ర హోంమంత్రులకు వివరించాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన గతనెలలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లినా పార్లమెంటు సమావేశాలు జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో మోడీ, అమిత్ షా ఇద్దరూ బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదు.
ఇప్పుడు ఏపీలో తన నిర్ణయం అమలు దిశగా అధికారిక ప్రక్రియ జగన్ దాదాపు పూర్తి చేశారు. ఇక నిర్ణయం లాంఛనంగానే మిగిలింది. ఏపీలో బీజేపీ పవన్ను దగ్గరకు తీయడంతో కొత్త సమీకరణాలకు తెరలేసింది. దీంతో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. ప్రధాని మీద ఆశలు పెట్టుకున్న రాజధాని రైతులు ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి మోడీ దిశా నిర్దేశం చేస్తారనే ఆశతో కనిపిస్తున్నారు. మరి ప్రధానిని సీఎం కన్విన్స్ చేయగలుగుతారా, లేక అమిత్ షా భిన్నంగా సూచనలు ఏమైనా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పుడు రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజలు సైతం జగన్ ఢిల్లీ యాత్రవైపు ఆసక్తిగా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications