వరద ప్రభావిత గ్రామాల్లోకి సీఎం జగన్ - బాధితులకు పరామర్శ : మూడు జిల్లాల్లో.. రెండు రోజులు..!!
ఏపీలో భారీ వర్షాలు..వరద ప్రభావంతో అతలా కుతలమైన మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 2,3 తేదీల్లో జగన్ తన సొంత జిల్లా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి..బాధితులను పరామర్శించనున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో బాధితులను పట్టించుకోకుండా... గాల్లో తిరగటం ఏంటంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసాయి. దీనికి స్పందనగా సీఎం జగన్ శాసనసభలో తాను ఖచ్చితంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.

తొలి రోజు కడప..చిత్తూరు జిల్లాల్లో
ఇక, రెండో తేదీన ఆయన ఉదయం గన్నవరం నుంచి కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో రాజంపేట మండలం మదనపల్లి చేరుతారు. పులపాతూరు గ్రామంలో సీఎం పర్యటిస్తారు. భారీగా దెబ్బ తిన్న గ్రామాన్ని సందర్శించి..బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. సహాయ శిబిరాలను సందర్శించి..గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి మందపల్లి గ్రామానికి వెళ్లనున్నారు. ఆ తరువాత వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డాం ప్రాంతాన్ని సీఎం స్వయంగా పరిశీలిస్తారు.

తిరుపతి నగరంలో పర్యటన
మందపల్లిలోనే వరద ప్రభావం...సహాయక చర్యలు..నష్టం పైన సీఎం జగన్ జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. అక్కడ నుంచి తరువాత రేణిగుంట విమానశ్రయానికి చేరుకుంటారు. చిత్తూరు జిల్లాలో పర్యటన భాగంగా.. రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో వరద ప్రభావిత గ్రామాల్లో సీఎం పర్యటిస్తారు. ఆ రెండు మండలాల్లో భారీగా నష్టం జరగటంతో ..అక్కడ దెబ్బ తిన్న మౌళిక వసతులను పరిశీలిస్తారు. ఆ తరువాత తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో అధికార- ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసారు. జిల్లా అధికారుల నుంచి వరదల కారణంగా జరిగిన నష్టం పైన చర్చించి..ప్రభుత్వ సాయం పైన సమీక్షిస్తారు.

నెల్లూరు జిల్లాలో రైతులతో సమావేశం
రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా 3వ తేదీన వరదలతో ముంపుకు గురైన తిరుపతి నగరంలోని ప్రాంతాల్లో పర్యటిస్తారు. స్థానికులను పరామర్శించి..వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇక, అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని హెలికాప్టర్ లో నెల్లూరు చేరుతారు. నెల్లూరు రూరల్ ప్రాంతం, బుచ్చిరెడ్డి పాలెం, కోవూరు మండలాల్లో సీఎం జగన్ పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. పెన్నా కట్టకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం ప్రకటిస్తారా
పెనుబల్లి లో వరదలతో నష్ట పోయిన రోడ్లను పరిశీలించటంతో పాటుగా పంట నష్టపోయిన రైతులతో సమావేమవుతారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలో జరిగిన నష్టం పై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించి.. జిల్లా అధికారులు.. ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక, మూడు జిల్లాల్లో పర్యటన ముగించుకొని 3వ తేదీ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయల్దేరనున్నారు. ఆ తరువాత ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications