రుణాలు ఇవ్వడంలో లక్ష్యం చేరుకోలేదని చంద్రబాబు అసహనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్ల సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రైతులకు రుణాలు మంజూరు చేయడంలో లక్ష్యాలను చేరుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
2017 - 18 ఆర్థిక సంవత్సరానికి రూ.87,471 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ 56 శాతమే లక్ష్యాలను చేరడం సరికాదని సీఎం అన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు.
ఆర్థిక అంశాలపై బ్యాంకర్లు, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కమిటీ వేయాలని ఆయన సూచించారు. మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వవలసిన రుణాల్లోనూ లక్ష్యాలను సాధించడంలేదన్నారు.
జనవరి 9, 10 తేదీల్లోగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సమస్యలు తెలుసుకోవాలని హితబోధ చేశారు. దీనిపై స్పందించిన బ్యాంకర్లు జన్మభూమి కార్యక్రమం చివరి రోజున రెండు లక్షల మందికి రుణాలు ఇస్తామన్నారు.