సైలెంట్ గా అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోన్న వైఎస్ జగన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024లో జరగబోయే ఎన్నికలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకికానీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కానీ అత్యంత కీలకం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను బేరీజువేస్తే ఈ రెండు పార్టీలకు ఇవి ఎందుకు కీలకమో అర్థమవుతాయి. కచ్చితంగా రెండోసారి విజయ బావుటా ఎగరవేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అందుకు తగ్గట్లుగా ఇప్పటినుంచే ఆయన వ్యూహాలను రచించుకుంటూ వస్తున్నారు.
తన పని తాను చేసుకుంటున్న ముఖ్యమంత్రి
ప్రభుత్వ కార్యక్రమాలకన్నా ఇప్పుడు పూర్తిగా పార్టీ కార్యక్రమాలపైనే దృష్టిసారించిన జగన్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. నేతలందరికీ మొత్తం 175 సీట్లు కైవసం చేసుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించారు. ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమానికి హాజరుకాని ఎమ్మెల్యేకు సీట్లివ్వనని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఇటీవలి సమావేశంలో ఆ విషయాన్ని వారికే నేరుగా చెప్పారు. తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు సీఎం జగన్.
కార్యకర్తలతో భేటీ అయితే ఎమ్మెల్యే ఖరారు
ముఖ్యమంత్రితోపాటు మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు, మరికొందరు సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో తిరిగి విజయం సాధిస్తామనే ధీమాను వైసీపీ వ్యక్తపరుస్తోంది. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటినుంచే అభ్యర్థులను ముఖ్యమంత్రి ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ పరిస్థితులు తెలుసుకోవడానికి నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఏ నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అవుతున్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించి రాబోయే ఎన్నికల్లో పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసుకుంటూ వస్తున్నారు.
వీరిద్దరూ ఖరారు
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం, ఉమ్మడి విజయనగరం జిల్లా రాజాం కార్యకర్తలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులుగా భరత్, కంబాల జోగులు ఖరారయ్యారు. జగన్ స్వయంగా వారి పేర్లు ప్రకటించారు. భరత్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండగా, జోగులు వరుస ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించారు. దీంతో మూడోసారి కూడా ఆయన్నే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేతలను గెలిపించాలని ముఖ్యమంత్రి కార్యకర్తలను కోరారు. తర్వాత ఏ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతారో అక్కడి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఈ విధంగా ఆయన 50 నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. కార్యకర్తలతో సమావేశమంటేనే అభ్యర్థులు ఖరారవుతుండటంతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్యేలకు గుండె దడగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.