ఈసారి పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ గెలుపు కష్టమే: తులసి రెడ్డి
ఉమ్మడి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్ కుటుంబానికి పెట్టనికోట. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికానీ, ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డేకాదు.. వారు ఎవరిని నిలబెట్టినా విజయం ఖాయమనే సంగతి రాష్ట్రమంతటా తెలుసు. అటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఈసారి ముఖ్యమంత్రి జగన్ గెలుపు అంత సులువు కాదని, 175 నియోజకవర్గాలను గెలుచుకునే సంగతి దేవుడెరుగు.. ఆయన అక్కడ గెలిస్తే గొప్పేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలను గెలుచుకోవడమే తమ లక్ష్యంగా ప్లీనరి సాగబోతోందని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్ ఘాట్ ఉన్న ఇడుపులపాయ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయానికి తాళాలు వేశారని తులసిరెడ్డి తెలిపారు. పులివెందుల అసెంబ్లీ ప్లీనరీలోనే నిరసన ధ్వనులు వచ్చాయని, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా జరిగిన మంత్రుల బస్సుయాత్ర గడబిడ బస్సుయాత్రగా తుస్సుమందన్నారు.
నవరత్నాలని చెప్పి వాటిని నకిలీ రత్నాలు చేసినందుకా? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందుకా?.. విద్యుత్తు ఛార్జీలు పెంచినందుకా?.. ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులను మోసం చేసినందుకు వైసీపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వారిని భిక్షం ఎత్తుకునేటట్లు చేశారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని, కేంద్రం నుంచి ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని... ఎందుకు మీకు ఓటువేయాలంటూ మరోసారి ప్రశ్నించారు.