ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ పర్ ఫెక్ట్ స్కెచ్?
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ జాగ్రత్తగా ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఒకసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను అధిగమించడానికి ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు వార్డు సభ్యుల వరకు అందరూ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాను వివరించి చెబుతున్నారు.

అధికారులైతే సమస్య సత్వరమే పరిష్కారమవుతుంది
కొన్నిచోట్ల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటం ముఖ్యమంత్రి జగన్ను ఆలోచనలో పడేసింది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిద్దాలంటే ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ వ్యవస్థ కూడా భాగమైతే బాగుంటుందని గుర్తించారు. ఇకనుంచి ప్రభుత్వ అధికారులు కూడా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పరిపాలన గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించబోతున్నారు. తమకు ఫలానా సమస్య ఉందని ప్రజాప్రతినిధులకు చెప్పడంకన్నా అధికారులకు చెప్పడమే మంచిదని, దీనివల్ల సమస్య ఎక్కడుందో గుర్తించి వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని జగన్ యోచనగా ఉంది.

ఎమ్మెల్యేల ఆక్రోశం
ఈ ఆలోచన సరైనదేనని పలువురు భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సమస్యల గురించి చెప్పినప్పటికీ వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందేనని, అదే అధికారులే నేరుగా రావడంవల్ల అక్కడికక్కడే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాలంటీర్ల వల్ల తమకు ఎటువంటి అధికారం లేకుండా పోయిందని, తాము కేవలం పేరుకే ఎమ్మెల్యేలుగా ఉన్నామంటూ పలువురు ఇప్పటికే తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా అధికారులే రంగంలోకి దిగడంవల్ల తమకు ఎటువంటి విలువ ఉండదంటున్నారు.

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ వెనకడుగు వేయదలుచుకోలేదని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టాలంటే తాము రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగాలని, ఈ తరహా వ్యాఖ్యలను పట్టించుకుంటే ముందుకు సాగలేమని ముఖ్యమంత్రి జగన్ యోచనగా ఉంది. గడప గడపకు మన ప్రభుత్వంలో కలెక్టర్లతో పాటు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు భాగం పంచుకుంటే ప్రభుత్వ గ్రాఫ్ తోపాటు పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతుందని సీఎం ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications